సైబర్ ‘టెర్రర్’!
ABN , Publish Date - May 19 , 2025 | 01:06 AM
- భారత-పాకిస్థాన్ మధ్య కొద్దిరోజుల క్రితం జరిగిన యుద్ధానికి కారణం మీరే. ఉగ్రవాదులకు మీరు నిధులు సమకూర్చుతున్నట్టు మా నిఘాలో తేలింది. త్వరలో మిమ్మల్ని అరెస్టు చేసి జైలుకు పంపడం ఖాయం. ఇది జరగకూడదంటే మేం చెప్పినట్టు చేయాలి. కొద్దిరోజుల క్రితం ఓ ప్రైవేటు ఉద్యోగికి వచ్చిన ఫోన్కాల్ ఇది. ఇలా సైబర్ నేరగాళ్లు ప్రతి సందర్భాన్ని తమకు అనుకూలంగా మలచుకుని ప్రజల నుంచి డబ్బు దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఉగ్రవాదాన్ని అవకాశంగా మార్చుకుంటున్న ‘ఈ’ నేరగాళ్లు
ఉగ్రవాదులకు నిధులు పంపుతున్నారంటూ ఫోన్లు
యుద్ధానికి కారణం ఇదేనంటూ బెదిరింపులు
సెంట్రల్ సర్వలెన్స్ టీంగా బిల్డప్
ట్రెండ్ మార్చిన డిజిటల్ అరెస్టు నిందితులు
- భారత-పాకిస్థాన్ మధ్య కొద్దిరోజుల క్రితం జరిగిన యుద్ధానికి కారణం మీరే. ఉగ్రవాదులకు మీరు నిధులు సమకూర్చుతున్నట్టు మా నిఘాలో తేలింది. త్వరలో మిమ్మల్ని అరెస్టు చేసి జైలుకు పంపడం ఖాయం. ఇది జరగకూడదంటే మేం చెప్పినట్టు చేయాలి. కొద్దిరోజుల క్రితం ఓ ప్రైవేటు ఉద్యోగికి వచ్చిన ఫోన్కాల్ ఇది. ఇలా సైబర్ నేరగాళ్లు ప్రతి సందర్భాన్ని తమకు అనుకూలంగా మలచుకుని ప్రజల నుంచి డబ్బు దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
ప్రపంచంలో ఉన్న అన్ని అంశాలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్న ‘ఈ’ నేరగాళ్లు కొద్దిరోజుల క్రితం జరిగిన యుద్ధాన్ని ఓ అవకాశంగా మార్చుకుంటున్నారు. డిజిటల్ అరెస్టు పేరుతో జనం నుంచి లక్షలాది రూపాయలను కాజేసిన సైబర్ నేరగాళ్లు ఇప్పుడు యుద్ధాన్ని వాడుకుంటున్నారు. ఇప్పటి వరకు డ్రగ్స్ను కొరియర్ ద్వారా పార్సిల్ చేశారంటూ ముంబై క్రైం బ్రాంచ్, సీబీఐ, ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులమని వీడియో కాల్స్ చేసి బెదిరించేవారు. లక్షలాది రూపాయలను వెంటవెంటనే బ్యాంక్ ఖాతాల్లో జమ చేయించుకునేవారు. ఎన్టీఆర్ జిల్లాలో ఈ డిజిటల్ అరెస్టులు కొద్దినెలల క్రితం ఒక ఊపు ఊపేశాయి. ఈ డిజిటల్ అరెస్టు నేరాల్లో బాధితుల సంఖ్య పెరగడానికి బ్యాంకులే కారణమని పోలీసులు భావించారు. దీనితో బ్యాంకులకు ఒక ఎస్వోపీ(స్టాండర్ట్ ఆపరేటింగ్ ప్రొసీజర్)ను జారీ చేశారు. ఖాతాదారులు ఎవరైనా హడావుడిగా బ్యాంకులకు వచ్చి భారీ మొత్తంలో డబ్బులు వేరే ఖాతాల్లో జమ చేసినా, ఆర్టీజీఎస్ ద్వారా మరొకరికి పంపినా వారికి సంధించాల్సిన ప్రశ్నలను రూపొందించి ఇచ్చారు. ఈ విధంగా చేయడంతో డిజిటల్ అరెస్టులకు బ్రేక్ పడింది. సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్టుల పేరుతో ఫోన్లు చేసినప్పటికీ వారు అనుకున్న లక్ష్యం నెరవేరకుండా బ్యాంకర్లు అడ్డుకున్నారు. సైబర్ నేరగాళ్లకు డబ్బులు జమ చేయడానికి వచ్చిన బాధితులకు అవగాహన కల్పించి సైబర్ క్రైం పోలీస్స్టేషన్కు పంపేవారు.
‘ఉగ్ర’ డిజిటల్!
సైబర్ నేరాల ద్వారా ఆదాయాన్ని రుచి మరిగిన నేరగాళ్లు డిజిటల్ అరెస్టుల పేరుతో ప్రజలకు ఫోన్లు చేస్తూనే ఉన్నారు. . ‘ఈ’ నేరగాళ్లు విసిరిన వలలో జనం చిక్కడం తగ్గిపోయింది. అయినా ఆ ప్రయత్నాలను మాత్రం సైబర్ నేరగాళ్లు ఆపడం లేదు. ఇప్పుడు వారికి కొద్దిరోజుల దాయాది దేశంతో భారత సైన్యం యుద్ధం అవకాశంగా మారింది. పాకిస్థాన్లో ఉన్న ఉగ్రమూలాలపై మనదేశ త్రివిధ దళాలు విరుచుపడిన విషయం తెలిసిందే. ఇప్పుడు డిజిటల్ అరెస్టుల కోసం ఈ నేరగాళ్లు ఉగ్రవాదులను ఎంపిక చేసుకుంటున్నారు. సంపాదించిన డేటా ప్రకారం ఆయా వ్యక్తులకు వీడియో కాల్స్ చేస్తున్నారు. ఉగ్రవాదులకు డబ్బులు సమకూర్చుతున్నట్టు సమాచారం ఉందని, కొద్దిరోజుల క్రితం జరిగిన యుద్ధానికి కారణం మీరేనంటూ బెదిరిస్తున్నారు. విజయవాడలో ఓ వ్యక్తికి సైబర్ నేరగాళ్లు ఈవిధంగా ఫోన్ చేశారు. ఆయన సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించగా అది సైబర్ నేరగాళ్లు చేసిన డిజిటల్ అరెస్టు వ్యవహారమని తేల్చారు.