Cyber Criminals: సిమ్ బ్లాక్ చేసి.. 23 లక్షలు కొట్టేసి..
ABN , Publish Date - Sep 28 , 2025 | 05:10 AM
ప్రజాప్రతినిధులు, ప్రముఖులు సైతం సైబర్ కేటుగాళ్ల మాయలో పడిపోతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి రూ.23.69 లక్షలు పోగొట్టుకున్నారు.
కావలి ఎమ్మెల్యేకు సైబర్ నేరగాళ్లు టోకరా
ఆర్టీఏ బకాయిలంటూ లింక్.. క్లిక్ చేయగానే సిమ్ బ్లాక్
కావలి, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ప్రజాప్రతినిధులు, ప్రముఖులు సైతం సైబర్ కేటుగాళ్ల మాయలో పడిపోతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి రూ.23.69 లక్షలు పోగొట్టుకున్నారు. ఆగస్టు 15న వెంకటక్రిష్ణారెడ్డి పర్సనల్ వాట్సాప్ నంబర్కు గుర్తుతెలియని వ్యక్తులు ఆర్టీఏ బకాయిలకు సంబంధించి ఒక లింక్ పంపించారు. కాంట్రాక్టర్, క్వారీల యజమాని అయిన ఎమ్మెల్యేకు పలు రవాణా వాహనాలు ఉండటంతో ఆర్టీఏ బకాయిలు ఏమైనా ఉన్నాయా...? అని ఆ లింక్ను క్లిక్ చేశారు. క్షణాల్లోనే ఫోన్ వేడెక్కి స్లిమ్ బ్లాక్ అయింది. జియో సిమ్ కావడంతో జియో సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. వారు చెప్పినట్టే ఆధార్ నంబర్ను లింక్ చేసినా సిమ్ యాక్టివేట్ కాలేదు. హైదరాబాద్లోని ఆధార్ విజిలెన్స్ విభాగం దృష్టికి తీసుకెళ్లగా వారు సిమ్ను యాక్టివేట్ చేయగా... రెండు బ్యాంకు ఖాతాల్లోని రూ.23.69 లక్షలు వాడేసినట్లు సమాచారం వచ్చింది. సిమ్ బ్లాక్ అయిన తర్వాత సైబర్ నేరగాళ్లు చేసిన పనేనని నాలుగు రోజుల క్రితం కావలి వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.