Digital Extortion: 12 మంది డిజిటల్ నిందితుల అరెస్టు
ABN , Publish Date - Nov 15 , 2025 | 06:20 AM
డిజిటల్ అరెస్టు పేరిట బెదిరించి డబ్బులు దోచుకుంటున్న 12 మంది సైబర్ ముఠా సభ్యులను పులివెందుల పోలీసులు అరెస్టు చేశారు.
కడప క్రైం, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): డిజిటల్ అరెస్టు పేరిట బెదిరించి డబ్బులు దోచుకుంటున్న 12 మంది సైబర్ ముఠా సభ్యులను పులివెందుల పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం కడపలో ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ విలేకరులకు నిందితుల వివరాలు వెల్లడించారు. 7 నెలల క్రితం నిందితులు వేంపల్లెకు చెందిన రిటైర్డ్ ఎంఈవో వీరారెడ్డికి వీడియోకాల్ చేసి ఆయన పేరుతో ఉన్న సిమ్ద్వారా మహిళల అక్రమ రవాణా జరుగుతోందంటూ ఢిల్లీలో కేసు నమోదుతో పాటు ఫేక్ సుప్రీంకోర్టు కాపీలు వాట్సప్ ద్వారా పంపించి డిజిటల్ అరెస్టు పేరుతో బెదిరించారు. ఈ అరెస్టును తాత్కాలికంగా వాయిదా వేసేందుకు డబ్బు చెల్లించాలని చెప్పడంతో వారి మాటలకు భయపడిన వీరారెడ్డి తన అకౌంటులోని డబ్బు పంపించారు. అలా దాదాపు ఏడు నెలల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేశారు. చివరికి వీరారెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో వీరారెడ్డి వద్ద డబ్బులు వసూలు చేసేందుకు నిందితులు వేంపల్లెకు వచ్చినట్టు సమాచారం రావడంతో 12 మంది అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను శుక్రవారం పులివెందుల డీఎస్పీ ఆధ్వర్యంలో అరెస్టు చేశారు.