Share News

CRDA Approves: రాజ్‌భవన్‌కు రూ.212 కోట్లు

ABN , Publish Date - Oct 09 , 2025 | 04:23 AM

రాజధాని అమరావతిలో రూ. 212 కోట్ల వ్యయంతో గవర్నర్‌ నివాసం రాజ్‌భవన్‌ నిర్మాణానికి సీఆర్‌డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది

CRDA Approves: రాజ్‌భవన్‌కు రూ.212 కోట్లు

  • అమరావతిలో నిర్మాణానికి సీఆర్‌డీఏ అథారిటీ ఆమోదం

  • రాజధానితో పాటు రైతులూ అభివృద్ధి చెందాలి

  • అధికారులకు చంద్రబాబు ఆదేశం

అమరావతి, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో రూ. 212 కోట్ల వ్యయంతో గవర్నర్‌ నివాసం రాజ్‌భవన్‌ నిర్మాణానికి సీఆర్‌డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది. కృష్ణా నది ఒడ్డున అమరావతి గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ నిర్మాణంలో భాగంగా రాజ్‌భవన్‌ నిర్మాణ జరగనుంది. దీనికి సంబంధించిన డిజైన్‌ అద్భుతంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం అధ్యక్షతన 53వ సీఆర్‌డీఏ అథారిటీ సమావేశం జరిగింది. మొత్తంగా 18 అంశాలపై అథారిటీ సమావేశంలో చర్చించారు. మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి 25 శాతం నిధులను సీఆర్‌డీఏ ఇచ్చేందుకు, రాజధాని ప్రాంతంలో నాలుగు కన్వెన్షన్‌ సెంటర్ల నిర్మాణానికి అథారిటీ అంగీకరించింది. రాజధాని నగర జోనింగ్‌ నిబంధనల్లో గ్రీన్‌ సర్టిఫైడ్‌ భవనాలు ఉండేలా అవసరమైన మార్పులకు అథారిటీ ఆమోదించింది. అమరావతి క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ సెంటర్‌ నిర్మాణానికి ఎగ్జిక్యూటివ్‌ ఏజెన్సీగా సీఆర్‌డీఏ వ్యవహరించడానికి అంగీకరించింది. హ్యాపీనెస్ట్‌, ఏపీ ఎన్‌ఆర్‌టీ ప్రాజెక్టులకు చెందిన భవనాల అనుమతుల ఫీజు మాఫీకి, రాజధానిలో నిర్మించే హోటళ్ల పార్కింగ్‌ నిబంధనల్లోనూ స్వల్ప మార్పులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కొండవీడు వాగు సమీపంలో 8400 క్యూసెక్కుల సామర్థ్యంతో మరో పంపింగ్‌ స్టేషన్‌ నిర్మాణానికి అథారిటీ నిర్ణయించింది. దీంతో పాటు మరికొన్ని సాంకేతిక అంశాలకు, పరిపాలన అంశాలకు అథారిటీ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సీఎం కొన్ని సూచనలు చేశారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా పార్కింగ్‌ సమస్య లేకుండా చూడాలన్నారు. రోడ్డుపై వాహనాల పార్కింగ్‌ చేసే పరిస్థితి రాకూడదన్నారు. విజయవాడ, గుంటూరు, మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్లు, తెనాలి మున్సిపాలిటీ, రాజధాని ప్రాంతంతో అనుసంధానం చేయాలని, బ్లూగ్రీన్‌ అమరావతిగా రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.


చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే.. ‘‘అమరావతితో పాటు రాజఽధానికి భూములిచ్చిన రైతులు కూడా అభివృద్ధి చెందాలి. భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్‌ ప్లాట్లను తక్షణమే ఇవ్వాలి. భూములను త్యాగం చేసిన రైతులకే రాజధాని అభివృద్ధి ఫలాలు మొదటగా అందాలి. రాజధాని రైతులకు కౌలు చెల్లింపుల్లోనూ ఎలాంటి జాప్యం జరగకూడదు. రైతులకు ఎక్కడ రిటర్నబుల్‌ ప్లాట్లు ఇస్తామని చెప్పామో..అక్కడే ఇవ్వాలి. ఏ ఊళ్లో భూములిచ్చిన వారికి ఆ ఊళ్లోనే ప్లాట్లు ఇస్తామన్నాం. అలాగే కేటాయింపులు చేయాలి.రాజధాని నిర్మాణపనుల్లో మరింతవేగం పెంచాలి. సెక్రటేరియట్‌ టవర్లతో సహా ఇతర నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలి. వెస్ట్‌ బైపాస్‌ రోడ్డును వెంటనే ప్రారంభించేచర్యలు తీసుకోవాలి. కరకట్ట రోడ్డును విస్తరించాలి. మూడు నెలల్లో రాజధాని నగరానికి ఒక రూపు తీసుకురావాలి’’ అని చెప్పారు. ఈ సమావేశానికి మంత్రి నారాయణ, సీఎస్‌ విజయానంద్‌ తదితరులు హాజరయ్యారు.

Updated Date - Oct 09 , 2025 | 04:26 AM