దేశంలో దొంగ ఓట్ల పాలన: రామకృష్ణ
ABN , Publish Date - Aug 10 , 2025 | 04:33 AM
దేశంలో దొంగ ఓట్ల పాలన జరుగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు.
కర్నూలు న్యూసిటీ, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): దేశంలో దొంగ ఓట్ల పాలన జరుగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. శనివారం కర్నూలులో జరిగిన జిల్లా సీపీఐ 24వ మహసభలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ, దేశంలో ప్రధాని మోదీ, అమిత్ షా దొంగ ఓట్లు వేయిస్తున్నారు. ఎక్కడో కాదు సాక్షాత్తూ బెంగుళూరు పార్లమెంటు పరిధిలోని ఒక నియోజకవర్గంలోకాంగ్రెస్కు అనుకూలంగా ఉండే ప్రాంతంలో 1,02,550 దొంగ ఓట్లు వేయించి బీజేపీ అభ్యర్థిని గెలిపించుకున్నారు. బిహార్లో 65 లక్షల ఓట్లను తొలగించారన్నారు. బీజేపీకి రాని ఓట్లన్నీ తొలగిస్తున్నారని ఆరోపించారు. దేశం పక్కా దొంగల రాజ్యంగా తయారైందన్నారు. ఈ నిజాలన్నీ కాంగ్రెస్ ఎంపీ రాహుల్గాంధీ బయటపెట్టారన్నారు. అయితే ఎన్నికల కమిషన్ సిగ్గులేకుండా రాహుల్గాంధీ స్వయంగా వచ్చి ఫిర్యాదు చేయలేదని చెప్పడం దుర్మార్గమన్నారు. ఎన్నికల అధికారిగా టీఎన్.శేషన్ లాంటి అధికారులు రావాలన్నారు. బీజేపీ నాయకులతో ఎన్నికల అధికారులు లాలూచి పడుతున్నారన్నారు.