Liquor Scam: మద్యం నిందితులకు బెయిల్ రద్దు చేయండి
ABN , Publish Date - Sep 08 , 2025 | 04:40 AM
మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితులు ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేస్తూ..
ఏసీబీ కోర్టు తీర్పుపై హైకోర్టులో సీఐడీ వ్యాజ్యాలు
నేడు విచారణకు సీజే అనుమతి
అమరావతి, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితులు ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేస్తూ శనివారం విజయవాడ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ అదే రోజు రాత్రి సీఐడీ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ మేరకు అత్యవసరంగా మూడు వేర్వేరు హౌస్మోషన్ పిటిషన్లు దాఖలు చేసింది. నిందితుల పాత్రపై సీఐడీ అధికారులు సమర్పించిన ఆధారాలను పరిగణనలోకి తీసుకోవడంలో ఏసీబీ కోర్టు విఫలమైందని.. నేర ఘటనలో ఇమిడి ఉన్న మొత్తం సొమ్ము స్వాధీనం చేసుకోలేదనే కారణంతో బెయిల్ మంజూరు చేయడం సరికాదని పేర్కొంది. ఉత్తర్వుల అమలును నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించింది. సీఐడీ పిటిషన్ల గురించి శనివారం రాత్రి రిజిస్ట్రార్ (జ్యుడీషియల్).. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్ దృష్టికి తీసుకెళ్లగా.. వాటిపై సోమవారం సంబంధిత బెంచ్ విచారణ జరిపేందుకు అనుమతిచ్చారు. .
జైలు వద్ద వైసీపీ డ్రామా
ధనుంజయ్రెడ్డి అండ్ కోను విడుదల చేయడం లేదని ఆందోళన
మద్యం కుంభకోణంలో బెయిల్ పొందిన ముగ్గురు నిందితుల విడుదలపై వైసీపీ నేతలు విజయవాడ జిల్లా జైలు వద్ద ఆందోళనకు దిగారు. మద్యం కేసులో నిందితులుగా ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి కె.ధనుంజయ్రెడ్డి, వైసీపీ అధినేత జగన్ మాజీ ఓఎస్డీ పి.కృష్ణమోహన్రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పకు విజయవాడ ఏసీబీ కోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది. సంబంధిత ఉత్తర్వుల కాపీలను న్యాయవాదులు జైలు అధికారులకు ఆ రోజే అందజేశారు. అయితే విడుదల సమయం దాటిపోవడంతో ఆదివారం విడుదల చేస్తామని జైలు అధికారులు చెప్పారు. దీంతో ఉదయాన్నే న్యాయవాదులు విష్ణువర్ధన్, రాజేశ్, వైసీపీ నేతలు అంబటి రాంబాబు, వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, దేవినేని అవినాశ్ తదితరులు జైలు వద్దకు చేరుకున్నారు. జైలు అధికారులు ఉద్దేశపూర్వకంగానే విడుదల చేయడం లేదని ఆందోళనకు దిగారు. టు జైల్లోనూ ఆ ముగ్గురు నిందితులు నిరసన తెలిపారు. చివరకు ఉదయం 9 గంటలకు విడుదలయ్యారు. జైలు అధికారులు ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారని ధనుంజయ్రెడ్డి ఆరోపించారు.


