Share News

స్థానికుల తొలగింపుపై ధుమారం

ABN , Publish Date - Jul 11 , 2025 | 11:25 PM

మండలంలోని మాధవరం గ్రామ సమీపంలో మారుతి ఇస్తాత ప్రైవేటు లిమిటెడ్‌ (మాధవరం స్టీల్‌ ఫ్యాక్టరీ)లో పని చేస్తున్న స్థానిక కార్మికులను తొలగించడంతో ధుమారం రేగింది.

   	  స్థానికుల తొలగింపుపై ధుమారం
కార్మికులతో మాట్లాడుతున్న మాధవరం ఎస్‌ఐ విజయకుమార్‌

మాధవరం స్టీల్‌ ఫ్యాక్టరీ వద్ద నిరసనలు

ఉద్యోగులను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్న కార్మికులు

మంత్రాలయం, జూలై 11 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మాధవరం గ్రామ సమీపంలో మారుతి ఇస్తాత ప్రైవేటు లిమిటెడ్‌ (మాధవరం స్టీల్‌ ఫ్యాక్టరీ)లో పని చేస్తున్న స్థానిక కార్మికులను తొలగించడంతో ధుమారం రేగింది. రోజూ కొంత మందిని టార్గెట్‌ చేస్తూ యాజమాన్యం కార్మికులను తొలగించే నిర్ణయం తీసుకోవడంతో స్థానికంగా ఉండే కార్మికులు భగ్గుమన్నారు. దీంతో శుక్రవారం ఉదయం ఫ్యాక్టరీ ముఖద్వారం ముందు తమ బైకులను అడ్డుగా పెట్టి ధర్నా చేశారు. కార్మికులను తొలగించి కడుపు కొడుతున్నారంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఫ్యాక్టరీలోకి ఉద్యోగులను వెళ్లనీయకుండా.. లోపలి నుంచి ఉద్యోగులను బయటకు రానీయకుండా దాదాపు 5 గంటలసేపు అడ్డుకున్నారు. దీంతో మాధవరం, మంత్రాలయం ఎస్‌ఐలు విజయకుమార్‌, శివాంజల్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ రాముడు, పోలీసు సిబ్బందితో వచ్చి కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక కార్మికులు మాట్లాడుతూ స్థానికులను వదిలేసి ఒరిస్సా, బీహార్‌, రాజస్తాన, మహారాష్ట్ర నుంచి కార్మికులను తీసుకువచ్చి పనులు చేయించుకుంటున్నారని మండిపడ్డారు. గురువారం రాత్రి పది మంది కార్మికులను తొలగించామని ప్రకటన చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు రూ.25వేలు ఇచ్చిన వెట్టి చాకిరి చేస్తున్నామని, అదే బీహార్‌, ఒరిస్సా కార్మికులకు రూ.40వేల నుంచి రూ.50వేలకు ఇస్తున్నారని తెలిపారు. అనంతరం పోలీసులు ఫ్యాక్టరీ యాజమాన్యం ప్లాంట్‌ ఇనచార్జి షమీర్‌, హెచఆర్‌ జీఎం శ్రీనివాసులు, ప్లాంట్‌ హెడ్‌ రాకేష్‌ పాండే, ప్లాంట్‌ వైస్‌ ప్రెసిడెంటు సునీల్‌ సింగ్‌తో ఎస్‌ఐలు చర్చలు జరిపారు. టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి రాఘవేంద్రరెడ్డి, మంచాల సొసైటీ చైర్మన రామకృష్ణారెడ్డి ఫ్యాక్టరీ యాజమన్యంతో చర్చలు జరిపారు. మరో రెండు రోజుల్లో ఫ్యాక్టరీ యాజమాన్యం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.

Updated Date - Jul 11 , 2025 | 11:25 PM