Seating Shortage Issue: చాలీచాలక.. కిక్కిరిసి..
ABN , Publish Date - Dec 19 , 2025 | 05:49 AM
నిల్చుంటే కూర్చోలేరు.. కూర్చుంటే నిలుచోలేరు. హాల్లో నుంచి బయటకు రావాలంటే పక్కన కూర్చున్న వాళ్లను.. వెనుక కూర్చున్న వారిని లేపాల్సిందే.
సచివాలయం కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ల సదస్సుకు సరిపోని సీట్లు
ఐపీఎస్లు కూడా రావడంతో జూనియర్ ఐఏఎస్లు బయటకు
ప్రజావేదిక కూల్చివేతతోనే ఈ పరిస్థితి!
అమరావతి, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): నిల్చుంటే కూర్చోలేరు.. కూర్చుంటే నిలుచోలేరు. హాల్లో నుంచి బయటకు రావాలంటే పక్కన కూర్చున్న వాళ్లను.. వెనుక కూర్చున్న వారిని లేపాల్సిందే. రాష్ట్ర సచివాలయంలో బుధ, గురువారాల్లో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎదుర్కొన్న ఇబ్బందులివి. ఖర్చులు తగ్గించుకోవాలన్న ఉద్దేశంలో ప్రభుత్వం ప్రతి కార్యక్రమాన్నీ సచివాలయంలోని ఐదో బ్లాక్లో ఉన్న కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహిస్తోంది. సమావేశ మందిరంలో సౌండ్ సిస్టమ్, స్ర్కీన్స్, తదితర సౌకర్యాలు ఉండడంతో అందులోనే జరుపుతోంది. ప్రైవేటు హోటళ్లు, కన్వెన్షన్ హాళ్లు, ఇతర వేదికల్లో సమావేశాలు పెడితే భారీగా ఖర్చవుతోంది. ఆ వ్యయం తగ్గించడానికే కూటమి ప్రభుత్వం దాదాపు అన్ని కార్యక్రమాలనూ సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లోనే పెడుతోంది. పొదుపు దిశగా ఆలోచించడం బాగానే ఉన్నా.. ఆ హాలు సరిపోక అధికారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రెండ్రోజులు జరిగిన కలెక్టర్ల సదస్సులో ఈ ఇబ్బందులు స్పష్టంగా కనిపించాయి. గతంలో ప్రజావేదిక ఉన్నప్పుడు వేల మందితో సమావేశాలు నిర్వహించినా ఇబ్బందులు ఉండేవి కాదు. జగన్ సీఎంగా వచ్చీరాగానే ప్రజావేదికను కూల్చివేశారు. ఇప్పుడు ప్రభుత్వం కీలకమైన సమావేశాలు నిర్వహించుకోవడానికి హాళ్లు, పెద్ద వేదికలు లేవు. దీంతో సచివాలయమే దిక్కవుతోంది. శాఖలవారీగా ప్రజెంటేషన్లు ఇచ్చేటప్పుడు సీట్లు మారేందుకు స్పెషల్ సీఎ్సలే తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు కొంత మంది అధికారులు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో కూడా సీఎంకు కనిపించని పరిస్థితి. ఉదయం కొంత ఆలస్యంగా వచ్చిన ఐఏఎ్సలకు అసలు కూర్చోవడానికి సీట్లే దొరకలేదు. ఐపీఎస్ అధికారులు, జిల్లాల ఎస్పీలు కూడా రావడంతో హాలు మరింత కిక్కిరిసింది. వారిని కూర్చోబెట్టడానికి.. కొంత మంది జూనియన్ ఐఏఎస్లు బయటకు రాగా.. ఇంకొంత మందిని ప్రొటోకాల్ అధికారులు బయటకు పంపించారు. కొందరు సీనియర్ ఐపీఎ్సలు లోపలకు రాకుండా చాలా సమయం హాలు వెలుపలే వేచి ఉండాల్సి వచ్చింది.
వసూళ్లపై దృష్టి సారించండి: వినయ్
కలెక్టర్లంతా రెవెన్యూ వసూళ్లపై దృష్టి సారించాలని ఆర్థిక శాఖ కార్యదర్శి వినయ్చంద్ ఆదేశించారు. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇంకా 3 నెలలే మిగిలి ఉంది. అంచనా వేసుకున్న ఆదాయ లక్ష్యాల సాధనలో వెనుకబడి ఉన్నాం. కావున కలెక్టర్లంతా రాబోయే 3 నెలలు రెవెన్యూ లక్ష్యాల సాధనపై దృష్టి సారించండి. 2025-26లో సొంత ఆదాయం రూ.1,34,000 కోట్లు లక్ష్యం. క్యూ1లో వాణిజ్య పన్నుల ఆదాయం 5ు తగ్గింది. క్యూ2లో ఆదాయం 12 శాతం పెరిగింది. క్యూ3లో అక్టోబరులో ఎక్సైజ్ ఆదాయం తగ్గింది. నవంబరులో సంస్కరణల వల్ల జీఎస్టీ వసూళ్లు తగ్గాయి’ అని తెలిపారు.