CM Chandrababu Naidu: ఆక్వా రైతును ఆదుకోండి
ABN , Publish Date - Sep 15 , 2025 | 03:32 AM
అమెరికా విధించిన సుంకాలతో ఇబ్బంది పడుతున్న ఆక్వా రైతాంగాన్ని ఆదుకోవాలని కేంద్రానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ..
అమెరికా సుంకాలతో రూ.25వేల కోట్ల నష్టం
5శాతం జీఎస్టీని తాత్కాలికంగా మినహాయించాలి
కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు
అమరావతి, సెప్టెంబరు 14(ఆంధ్రజ్యోతి): అమెరికా విధించిన సుంకాలతో ఇబ్బంది పడుతున్న ఆక్వా రైతాంగాన్ని ఆదుకోవాలని కేంద్రానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వివిధ శాఖల కేంద్ర మంత్రులకు ఆదివారం ఆయన వేర్వేరుగా లేఖలు రాశారు. జీఎస్టీ, ఆర్థిక వెసులుబాట్లు వంటి అంశాలు పరిశీలించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు, ఇతర దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకునేలా చూడాలని వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్కు, దేశీయ మార్కెట్ పెంచేందుకు చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్కు లేఖలు రాశారు. ‘ఏపీకి జాతీయ స్థాయిలో రొయ్యల ఎగుమతుల్లో 80శాతం వాటా, సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో 34శాతం వాటా ఉంది. రూ.21,246 కోట్ల విలువైన సముద్ర, మత్స్య ఉత్పత్తులు ఏపీ నుంచి ఎగుమతి అవుతున్నాయి. సుంకాలు పెరగడంతో రాష్ట్రంలో ఆక్వా రంగంపై ఆధారపడిన 2.5లక్షల ఆక్వా రైతు కుటుంబాలతో పాటు ఆక్వా అనుబంధ రంగాలపై ఆధారపడిన 30లక్షల మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుంకాల ప్రభావంతో రూ.25వేల కోట్ల మేర నష్టం జరిగి ఉంటుంది. 50శాతం మేర ఎగుమతుల ఆర్డర్లు రద్దయ్యాయి. దాదాపు 2వేల కంటైనర్లలో జరుగుతున్న ఎగుమతులపై రూ.600కోట్ల భారం పడింది’ అని కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ఆక్వా రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఆక్వా ఫీడ్ ఉత్పత్తిదారులతో జరిగిన చర్చల ఫలితంగా కేజీ ఫీడ్ ఎమ్మార్పీపై రూ.9మేర తగ్గించగలిగామని, ఆక్వా రైతులకు సబ్సిడీతో ట్రాన్స్ఫార్మర్లు సరఫరా చేసే ఆలోచన చేస్తున్నామని వివరించారు. ఎగుమతిదారులకు, ఆక్వా కంపెనీలకు బ్యాంకుల నుంచి ఆర్థిక సహాయం, వడ్డీ చెల్లింపులపై 240 రోజుల పాటు మారటోరియం విధించాలని కేంద్ర ఆర్థికమంత్రిని కోరారు. వడ్డీ రాయితీ కల్పించడంతో పాటు, ఫ్రోజెన్ రొయ్యలపై ఉన్న 5శాతం జీఎస్టీని తాత్కాలికంగా మినహాయించడం వంటిచర్యలు తీసుకోవాలని కోరారు. అమెరికా కాకుండా ఇతర దేశాలకు ఆక్వా మార్కెట్ను విస్తరించే అంశంపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. ఈయూ, దక్షిణ కొరియా, సౌదీ, రష్యాకు ఆక్వా ఎగుమతులు పెరిగేలా ఆయా దేశాలతో ఫ్రీట్రేడ్ ఒప్పందాలు కుదుర్చుకునే అంశాన్ని పరిశీలించాలన్నారు.
ఎగుమతిదారులకు మధ్యంతర ఆర్థిక సహాయం, ఎగుమతులపై విధించే సుంకాలు, పన్నుల ఉపశమనం పథకంపై మరింత స్పష్టత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. యూరోపియన్ యూనియన్ దేశాలకు సీ-ఫుడ్ సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఎగుమతిదారులు తమకు సమాచారం ఇచ్చారని చంద్రబాబు వివరించారు. దేశీయంగా ఆక్వా మార్కెట్ పెంచుకోవటానికి రూ.100కోట్లతో కార్పస్ ఫండ్ కేటాయించాలని కోరారు. కోల్డ్ స్టోరేజీలు, హైజనిక్ ఫిష్, సీ-ఫుడ్ మార్కెట్ల ఏర్పాటు చేయాలన్నారు. రైతుల నుంచి ఆక్వా ఉత్పత్తులను నేరుగా మార్కెట్లకు తరలించేలా ఏపీ రొయ్యల ఉత్పత్తిదారుల సమన్వయ కమిటీని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అలాగే దేశంలోనూ సీ-ఫుడ్ వినియోగం పెంచేలా చర్యలు చేపట్టాలని, కోరారు. దక్షిణాది నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు ఆక్వా ఉత్పత్తుల రవాణా కోసం ప్రత్యేక రైళ్లు నడపాలని కోరారు. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా మత్స్యకారులకు రూ.1లక్ష వరకు వన్టైమ్ టాపప్ రుణాలివ్వాలని, కొత్త మార్కెట్లలో పోటీతత్వాన్ని పెంచడానికి ఎఫ్ఐడీఎఫ్ ద్వారా ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, కోల్డ్ చైన్ సౌకర్యాలను అభివృద్ధి చేయాలని కోరారు. ఐకార్-సీఐబీఏ, ఐకార్-ఎన్బీఎ్ఫజీఆర్ వంటి సంస్థల ప్రాంతీయ కార్యాలయాలు ఏపీలో ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రులకు రాసిన లేఖల్లో సీఎం చంద్రబాబు విజ్ఞప్తిచేశారు.