CM Chandrababu: రూల్స్ అంటూ గిరిగీసుకోవద్దు
ABN , Publish Date - Sep 12 , 2025 | 04:33 AM
ప్రభుత్వ విజయాల్లో కలెక్టర్లే కీలకమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అన్నిటికీ రూల్స్ అంటూ గిరిగీసుకోవద్దని, మానవీయ కోణంలోనూ ఆలోచించి పనిచేయాలని సూచించారు.
మానవీయకోణంలోనూ ఆలోచించండి
ప్రభుత్వ విజయాల్లో కలెక్టర్లే కీలకం
సీఎం అంటే కామన్ మ్యాన్.. మీరూ అదే పాటించండి
అత్యుత్తమ పనితీరు కనబర్చండి
ప్రజలకు అందుబాటులో ఉండండి
మార్పు తేవడానికి మీకో మంచి అవకాశం
పొలిటికల్ గవర్నెన్స్కు పెద్దపీట వేయండి
తప్పు చేయమని కాదు.. కలిసి పనిచేయండి
ఫేక్ ప్రచారాలపై వెంటనే స్పందించండి
కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
అమరావతి, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ విజయాల్లో కలెక్టర్లే కీలకమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అన్నిటికీ రూల్స్ అంటూ గిరిగీసుకోవద్దని, మానవీయ కోణంలోనూ ఆలోచించి పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలో 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించిన సందర్భంగా గురువారం వారితో పాటు మిగిలిన జిల్లాల కలెక్టర్లతోనూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. సమర్థమైన పాలన అందించాలంటూ కలెక్టర్లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. 360 డిగ్రీల్లో పనితీరు పరిశీలించి కలెక్టర్లుగా అవకాశం ఇస్తున్నానని, తన ఆలోచనలు అందుకొని, అత్యుత్తమ పనితీరు కనబర్చాలని సూచించారు. ‘సీఎం అంటే కామన్ మ్యాన్ అని నేను చెబుతున్నా. మీరూ అదే పాటించండి. ప్రజలకు అందుబాటులో ఉండండి. నిత్యం వారితో మమేకమవ్వండి. మానవీయకోణంలో ఆలోచించి పనిచేయండి. అప్పుడే మీకు, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది’ అని చంద్రబాబు అన్నారు.
ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలి
‘‘నేను 1995లో మొదటిసారి సీఎం అయ్యాను. 30 ఏళ్లలో 15 ఏళ్లు సీఎంగా ఉన్నాను. ఎంతో మంది అధికారులను నియమించాను. చాలామందితో పని చేయించుకున్నాను. అయితే ఈసారి కలెక్టర్లకు పోస్టింగ్ల విషయంలో మరింత గట్టి కసరత్తు చేశాను. గతంలో ఎప్పుడూ ఇంత కసరత్తు చేయలేదు. దీనికి కారణం ఉంది. అనేక సమస్యల మధ్య ఏడాది క్రితం మనం పాలన ప్రారంభించాం. ప్రజలు మాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వాటిని తీర్చాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. వీటిని మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్లాల్సి ఉంది. ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే కలెక్టర్లే కీలకం. మీ పనితీరే ప్రభుత్వానికి విజయాలను తెచ్చి పెడుతుంది. 1995లో తొలిసారి నేను సీఎంగా ఉన్నప్పుడు చాలా దృఢంగా, కఠినంగా ఉండేవాడిని. ఫైళ్ల క్లియరెన్స్ వంటి కార్యక్రమాలతో అధికారులను పరుగులు పెట్టించేవాడిని. ఆ పనితీరు అధికారులకు, ఉద్యోగులకు కొంత కష్టంగా అనిపించినా ప్రగతిలో మార్పు కనిపించింది. అభివృద్ధి వేగవంతమైంది. అదొక్కటే కాదు.. ఎప్పుడు విపత్తు వచ్చినా అధికారుల కంటే ముందు నేనే వెళ్లేవాడిని. విశాఖలో హుద్హుద్ సమయంలో ఫ్లైట్ కూడా వెళ్లని పరిస్థితుల్లో చేరుకుని 10 రోజులు అక్కడే ఉన్నాను. ఇలాంటి చర్యల వల్ల ప్రజలకు ఆందోళన పోతుంది. ప్రభుత్వం సాయం చేస్తుందనే నమ్మకం కలుగుతుంది. స్పందించే ప్రభుత్వంగా అంతా గుర్తిస్తారు. అధికారంలో ఉన్నప్పుడు రిస్క్ ఉంటుంది. లీడర్స్ అనే వాళ్లు రిస్క్ తీసుకోవాలి.. అప్పుడే ఫలితాలు వస్తాయి. ఫ్యాక్షన్, నక్సలిజం, మత ఘర్షణల విషయంలో సమర్థులైన అధికారులకు స్వేచ్ఛనిచ్చి పనిచేయించాను. దీంతో మంచి పలితాలు వచ్చాయి’’ అని చంద్రబాబు అన్నారు.
మీరే నా టీమ్
‘‘ప్రజల జీవితాల్లో మార్పులు తేవడానికి మంచి అవకాశం కలెక్టర్ ఉద్యోగం. బాగా పనిచేస్తే మీకూ మంచి గుర్తింపు వస్తుంది. మీరు క్షేత్రస్థాయిలో బాగా పనిచేస్తే ప్రతిదానిలో మార్పు చూపించవచ్చు. సాంఘిక సంక్షేమ హాస్టల్కు వెళ్లి వసతులు చూడండి. ప్రభుత్వ ఆస్తులు రక్షించడంలో మీరే కీలకం. కలెక్టర్లుగా మీరు బాధ్యతగా పారదర్శకంగా ఉంటే, మీ కింది అధికారులు కూడా వాటిని పాటిస్తారు. మీరు వారిలో స్ఫూర్తి నింపాలి. జిల్లా కలెక్టర్ల ఎంపికలో నాకున్న అవకాశాల్లో మీరే బెస్ట్. మీరు అత్యుత్తమ పనితీరు చూపాలి. నాలుగోసారి ముఖ్యమంత్రిగా నా టీమ్ మీరే. పనిచేస్తే ప్రోత్సహిస్తా. ఆశించిన ఫలితాలు రాకపోతే మాత్రం సహించను. పొలిటికల్ గవర్నెన్స్కు పెద్దపీట వేయండి. ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పిన దాంట్లో మంచీ చెడూ చూడండి. పొలిటికల్ గవర్నెన్స్ చేసిన సమయంలో నేను ఓడిపోలేదు. ఎక్కువ బ్యూరోక్రటిక్ గవర్నెన్స్ చేసినప్పుడే నష్టపోయాను’’ అని అన్నారు.
ఇతర జిల్లాలతో పోటీ పడండి
‘‘మీ నిర్ణయాలు క్రియేటివ్గా, ఇన్నోవేటివ్గా ఉండాలి. కేంద్ర ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకోవాలి. ప్రతి దానికి డబ్బులు లేవని కూర్చుంటే పని అవ్వదు. అన్ని రాష్ట్రాల కంటే ఏపీ నంబర్ 1గా ఉండాలని అందరితో పోటీ పడుతుంటా. మీరు కూడా అన్ని జిల్లాల కంటే ముందు ఉండాలని ఇతర జిల్లాలతో పోటీ పడాలి. అసత్యాలు ప్రచారం చేసే మీడియా, సోషల్ మీడియా విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఫస్ట్ అవర్లోనే మీరు స్పందించాలి. మనం చేసేది ప్రజల్లోకి వెళ్లాలి. లేకపోతే అసత్యాలే నిజమని ప్రజలు నమ్మే అవకాశం ఉంది. కలెక్టర్ అనేది అధికారం కాదు.. అహంకారం, ఈగోలు వద్దు. కామన్ మ్యాన్గా ఉండాలి’’ అని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.