Share News

World Economic Summit: జనవరిలో దావోస్‌కు చంద్రబాబు

ABN , Publish Date - Dec 09 , 2025 | 05:50 AM

ప్రపంచ ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో వచ్చే నెలలో స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు.

World Economic Summit: జనవరిలో దావోస్‌కు చంద్రబాబు

  • 19 నుంచి ప్రపంచ పెట్టుబడుల సదస్సులో పాల్గొననున్న సీఎం

  • మంత్రులు లోకేశ్‌, టీజీ భరత్‌, అధికారుల బృందంతో హాజరు

అమరావతి, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): ప్రపంచ ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో వచ్చే నెలలో స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. మంత్రులు లోకేశ్‌, టీజీ భరత్‌, సీఎం ముఖ్య కార్యదర్శి కార్తికేయ మిశ్రా, పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్‌.యువరాజ్‌, ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్‌, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ శుభం బన్సాల్‌, సీఎం చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ తంగిరాల దత్తయశ్వంత్‌తో కూడిన బృందం చంద్రబాబుతోపాటే దావోస్‌కు వెళ్లనుంది. జనవరి 19 నుంచి 23 వరకు చంద్రబాబు దావోస్‌లో జరిగే ప్రపంచ పెట్టుబడుల సదస్సులో పాల్గొంటారు. రాష్ట్రానికి పెట్టుబడులను రాబట్టేందుకు ప్రపంచంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలతో ఆయన చర్చలు జరుపుతారు. చంద్రబాబు బృందం దావోస్‌ పర్యటనకు అనుమతి మంజూరుచేస్తూ రాష్ట్రప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు విడుదల చేసింది. ‘తెలంగాణ రైజింగ్‌ గ్లోబ్‌ సమ్మిట్‌-2025’కు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సదస్సు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, పురోగతికి, ఆవిష్కరణలకు వేదిక కావాలని ఆకాంక్షించారు. ఈ మేరకు సోమవారం ఆయన ‘ఎక్స్‌’ వేదికగా పోస్టు చేశారు.

Updated Date - Dec 09 , 2025 | 05:51 AM