AP Govt: మూడేళ్లలో 17 లక్షల ఇళ్లు
ABN , Publish Date - Nov 22 , 2025 | 03:58 AM
రాష్ట్రంలో ఇటీవలే 3లక్షలకు పైగా పేదల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేసి సామూహిక గృహ ప్రవేశాలు చేయించిన సీఎం చంద్రబాబు, రానున్న మూడేళ్లలో...
2029 జనవరికల్లా ‘హౌసింగ్ ఫర్ ఆల్’: సీఎం
పొరపాట్లు జరక్కూడదు.. జాప్యం చేయకూడదు
ప్రతి 3 నెలలకోసారి సామూహిక గృహప్రవేశాలు
వచ్చే ఉగాదికి 5 లక్షల మందికి ఇళ్ల తాళాలు
ఇక ఉమ్మడి కుటుంబాలను
ప్రోత్సహిస్తూ ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలి
టిడ్కో, గృహ నిర్మాణ శాఖపై చంద్రబాబు సమీక్ష
పీఎంఏవై 1.0 హౌసింగ్ స్కీంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీవీటీజీ సామాజిక వర్గాలకు అదనంగా చెల్లింపులు చేస్తున్నాం. ఇప్పుడు ముస్లిం మైనారిటీలకూ అదనంగా రూ.50 వేలు చెల్లిస్తాం. 18 వేల మంది లబ్ధిదారులకు రూ.90 కోట్లు ఖర్చవుతుంది. మనం ఆయా వర్గాలకు చేకూరుస్తున్న అదనపు సాయాన్ని వారికి వివరించాలి.
- ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇటీవలే 3లక్షలకు పైగా పేదల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేసి సామూహిక గృహ ప్రవేశాలు చేయించిన సీఎం చంద్రబాబు, రానున్న మూడేళ్లలో 17 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని నిర్దేశించారు. ఈ లక్ష్య సాధన కోసం తగిన కార్యాచరణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. లక్ష్యానికి అనుగుణంగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేస్తూ.. ఇకపై ప్రతి 3నెలలకొకసారి సామూహిక గృహప్రవేశాలు చేయించాలని స్పష్టంచేశారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో గృహ నిర్మాణశాఖ, టిడ్కో అధికారులతో ఆయన సమీక్ష జరిపారు. ‘అందరికీ ఇళ్లు(హౌసింగ్ ఫర్ ఆల్) కట్టిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చాం. ఈ హామీని నెరవేర్చే ప్రక్రియలో ఇప్పటికే 3లక్షలకు పైగా ఇళ్లలో సామూహిక గృహ ప్రవేశాలు చేయించాం. ‘హౌసింగ్ ఫర్ ఆల్’ కార్యక్రమాన్ని 2029 జనవరి నాటికి పూర్తిచేయాలి. ఉన్నతాధికారుల నుంచి ఉద్యోగుల వరకు అందరూ బాధ్యతగా తీసుకోవాలి. కూటమి ప్రభుత్వం వచ్చాక సుమారు 20 లక్షల ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మిగిలిన 17లక్షల ఇళ్లను వచ్చే మూడేళ్లలో పూర్తి చేయాలి. వచ్చే ఉగాది నాటికి 5 లక్షల ఇళ్లలో సామూహిక గృహ ప్రవేశాలు జరగాలి. త్వరలో టిడ్కో, హౌసింగ్ ఉన్నతాధికారులు, ఉద్యోగులందరితో సమీక్ష చేస్తాను’ అని తెలిపారు. ‘ప్రభుత్వం నెరవేర్చాల్సిన హామీ హౌసింగ్ ఫర్ ఆల్. ఈ కార్యక్రమం అమలులో పొరపాట్లూ జరగకూడదు.. జాప్యం చేయకూడదు. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఉమ్మడి కుటుంబాలను ప్రోత్సహించే విధంగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టేలా చూడాలి’ అని సూచించారు.
అప్పుడు ఉపాధి బిల్లులూ ఆపేశారు..
గత ప్రభుత్వం కక్షసాధింపులో భాగంగా 2014-19 మధ్య చేపట్టిన ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ స్కీంకు సంబంధించిన కొందరు లబ్ధిదారులకు బిల్లులు నిలిపివేసిందని సీఎం చెప్పా రు. రూ.920 కోట్ల మేర బిల్లులు పెండింగ్లో పడ్డాయన్నారు. వీటిని తిరిగి రప్పించేందుకు కేంద్రంతో సంప్రదింపులు జరపాలని ఆదేశించారు. వాటిని గత ప్రభుత్వం ఏవిధంగా అడ్డుకుందో వివరించాలన్నారు. ‘2014-19 మధ్య జరిగిన ఉపాధి హామీ పథకం పనుల బిల్లులను గత ప్రభుత్వం ఇదే తరహాలో ఆపేసింది. ఆ బిల్లులను మళ్లీ స్ట్రీమ్లైన్లో పెట్టి బిల్లులు వచ్చేలా చేశాం. అదే తరహాలో ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ స్కీంకు సంబంధించిన పెండింగు బిల్లులను కూడా రప్పించేలా కృషి చేయాలి’ అని సీఎం స్పష్టంచేశారు.