CM Chandrababu: ఉద్యాన హబ్గా సీమ
ABN , Publish Date - Nov 26 , 2025 | 04:26 AM
రాయలసీమను ఉద్యాన హబ్గా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ఉద్యాన శాఖ పని చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో ప్రోత్సాహకాలు
డిమాండ్ ఉన్న పంటలు పండించే రైతులకు మరిన్ని సౌకర్యాలు
5.98 లక్షల మంది రైతులకు లబ్ధి.. ఉద్యాన శాఖపై సీఎం సమీక్ష
అమరావతి, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): రాయలసీమను ఉద్యాన హబ్గా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ఉద్యాన శాఖ పని చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సర్టిఫికేషన్, ట్రేసబిలిటీ వంటి అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రపంచంలో డిమాండ్ ఉన్న ఉద్యాన పంటల్లో 18 రకాలు రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లోనే పండుతాయని అన్నారు. ఉద్యాన పంటలు సాగు చేసే రైతులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఇందుకోసం పూర్వోదయ పథకం నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాయలసీమ ఉద్యాన పంటల అభివృద్ధిపై మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం సమీక్ష జరిపారు. రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో 92 క్లస్టర్ల ద్వారా రైతులకు జీవనోపాధి పెంచేలా కార్యాచరణ రూపొందించారు. పూర్వోదయ పథకంలో భాగంగా రహదారులు, జలవనరుల ప్రాజెక్టుల వంటి పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం 5.98 లక్షల మంది ఉద్యాన రైతులకు లబ్ధిచేకూరేలా రూ.40వేల కోట్లతో అమలు చేయనున్న ప్రణాళికపై సమీక్షించారు. అలాగే ప్రపంచ బ్యాంక్ నిధులతో రాయలసీమ అభివృద్ధికి ఏయే అంశాల్లో దృష్టి సారించాలనే దానిపైనా, నీతి ఆయోగ్ సిఫారసులతో రాయలసీమ, ప్రకాశం జిల్లాల పరిధిలో ఉద్యానవనాలు, రహదారులు, జలవనరులు వంటి అంశాలపైనా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాయలసీమలో 65రకాల ఉద్యాన పంటలు పండుతుంటే.. 18 పంటలకు మంచి డిమాండ్ ఉందన్నారు. ఈ పంటలు పండించేలా రైతులను ప్రోత్సహించాలన్నారు.
రైతులకు మేలు కలగాలి
‘‘రెగ్యులర్ ఉద్యాన పంటల కంటే.. భవిష్యత్లో ప్రజల అలవాట్లకు అనుగుణంగా పంటలు పండించాలి. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో టేబుల్ వెరైటీలను పండించి, ఆ పంటలకు విలువ జోడించాలి. అప్పుడు రైతులకు ఆర్థిక ప్రయోజనాలు అందుతాయి. మైక్రో ఇరిగేషన్ ద్వారా ఈ ఉద్యాన పంటలకు నీటిని అందించాలి. హార్టీకల్చర్ జోన్లుగా తీర్చిదిద్ది, ప్రోత్సాహకాలు కల్పించాలి. ఆర్గానిక్ సేద్యంతో పంటలు పండించాలి. ఆక్వా రంగం తరహాలోనే ఉద్యాన రంగం కూడా భవిష్యత్లో అగ్రస్థానానికి చేరుతుంది. రాయలసీమ, ప్రకాశంలో ప్రస్తుతం ఉన్న 10 రకాల ఉద్యాన పంటలతో పాటు డిమాండ్ ఉన్న మరో 8 రకాలను పండించేలా చర్యలు తీసుకోవాలి. 50 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటల ద్వారా పెద్దఎత్తున రైతులకు ప్రయోజనం కలుగుతుంది. 18 ముఖ్యమైన పంటలను లక్ష్యంగా చేసుకుని, వాటికి మంచి సాగు సదుపాయాలు, రవాణా, మార్కెటింగ్, కోల్డ్చైన్ లాంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి’’ అని అన్నారు.
అంతర్జాతీయ మార్కెటింగ్పై దృష్టి
‘‘దుబాయ్ లాంటి ప్రాంతాలకు ఎయిర్ కార్గో ద్వారా పండ్లను రవాణా చేయగలగాలి. దుబాయ్ నుంచి ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు పండ్లను రవాణా చేసే అవకాశం ఉంటుంది. స్పెషల్ కార్గోగా పండ్లను అంతర్జాతీయ మార్కెట్లకు తరలిస్తే రైతులు, రాయలసీమ, ప్రకాశం ప్రాంత భవిష్యత్ మారిపోతుంది. రాయలసీమ ప్రాంతంలో ఇంకా కవర్ కాని ప్రాంతాలను గుర్తించి, అక్కడికీ నీటి సరఫరా కోసం ఎంత వ్యయం అవుతుందో అంచనా వేయాలి. సీమలో మారుమూల ప్రాంతాలను కలుపుతూ మరికొన్ని రహదారులు రావాల్సి ఉంది. తద్వారా మార్కెటింగ్ మెరుగుపడుతుంది. ఉద్యాన పంటల సాగు మొదలు మార్కెటింగ్ వరకు మొత్తం రూ.14,800కోట్లు ప్రాజెక్టులకు ఖర్చుపెట్టబోతున్నాం. సబ్సిడీగా 9వేల కోట్లు ఇచ్చేలా ప్రణాళిక వేస్తున్నాం. ఈ విషయం రైతులకు అర్థమయ్యేలా చెప్పాలి. అరటి, చీని, బొప్పాయి, దానిమ్మ, మామిడి, నిమ్మతో పాటు ఉల్లి, టమోటా, మిర్చి వంటి పంటలపై దృష్టి పెట్టాలి’’ అని సీఎం సూచించారు. ప్రభుత్వ చర్యల వల్ల రాయలసీమలో భూగర్భ జలాలు మెరుగ్గా ఉన్నాయన్న ప్రస్తావన ఈ సమీక్షలో వచ్చింది. హంద్రీ-నీవా సహా వివిధ ప్రాజెక్టుల ద్వారా నీటిని సరఫరా చేస్తుండటంతో సీమలో ఉద్యాన సాగు గతంతో పోల్చుకుంటే సులభతరమైందని మంత్రి పయ్యావుల కేశవ్ అభిప్రాయపడ్డారు. పంటలు చక్కగా పండటం వల్ల రైతులకు ఆదాయంతో పాటు భూముల రేట్లు పెరిగాయని, దానికి ఉమ్మడి అనంతపురం జిల్లానే ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పారు.