Share News

AP CM Chandrababu: సంక్షేమ హాస్టళ్లలో తనిఖీలు తప్పనిసరి

ABN , Publish Date - Nov 26 , 2025 | 04:30 AM

ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో తనిఖీలను మంత్రులు, ఆయా శాఖల ఉన్నతాధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది తమ విధి నిర్వహణలో భాగంగా చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

AP CM Chandrababu: సంక్షేమ హాస్టళ్లలో తనిఖీలు తప్పనిసరి

  • విద్యార్థులకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు: సీఎం

  • సంబంధిత మంత్రులు, అధికారులు తమ విధి నిర్వహణలో భాగం చేసుకోవాలి

  • పారిశుధ్యంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు

  • విద్యార్థులకు రెగ్యులర్‌గా ఆరోగ్య పరీక్షలు

అమరావతి, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో తనిఖీలను మంత్రులు, ఆయా శాఖల ఉన్నతాధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది తమ విధి నిర్వహణలో భాగంగా చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో నీటి సరఫరా, పారిశుధ్యం, ఇతర సదుపాయాలపై మంగళవారం సచివాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ హాస్టళ్లు, రెసిడెన్షియల్‌ స్కూళ్లలో పారిశుఽధ్యాన్ని నూటికి నూరుశాతం నిర్వహించాలన్నారు. చిన్న పొరపాటు జరిగినా సహించేది లేదని స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో హాస్టళ్లలో జరిగిన తప్పిదాలు మళ్లీ పునరావృతం కాకూడదని ఆదేశించారు. ఒకవేళ మళ్లీ జరిగితే.. ఏం జరిగిందనేది తెలుసుకోవడం ఉండదని, నేరుగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 20 శాతం హాస్టళ్లలో టాయిలెట్ల నిర్మాణం ఇంకా జరగాల్సి ఉందని, వాటిని యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఆర్వో ప్లాంట్లు, టాయిలెట్లు లేకుండా హాస్టళ్లు ఉండటం సరికాదని పేర్కొన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇవన్నీ జరిగాయన్నారు. ప్రతి హాస్టల్‌, ప్రతి రెసిడెన్షియల్‌ పాఠశాలలోనూ ఆర్వో ప్లాంట్‌ ఉండాల్సిందేన్నారు. విద్యార్థులకు రెగ్యులర్‌గా ఆరోగ్య పరీక్షలు చేయించాలని అధికారులకు సూచించారు. హాస్టళ్లలోని 4.17 లక్షల మంది విద్యార్థుల రక్త నమూనాలు సేకరించి, సమస్యలు ఉన్నవారిని ముందుగానే గుర్తించి చికిత్సలు అందించాలని నిర్దేశించారు. బడుగు విద్యార్థులకు చేసే సాయాన్ని బాధ్యతగా తీసుకోవాలని పేర్కొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో హాస్టళ్లు పెట్టారని, దీనికి విఘాతం కలిగించేలా అలసత్వం వహిస్తే ఊరుకొనేది లేదని తేల్చిచెప్పారు. హాస్టళ్లలో పరిస్థితి పరిశీలించేందుకు క్షేత్రస్థాయు పర్యటనలు చేపట్టడంతో పాటు పరిస్థితులపై నిత్యం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించుకోవాలని అధికారులకు సూచించారు.


సంక్షేమ శాఖలకు ప్రత్యేకంగా కంట్రోల్‌ రూం

సంక్షేమ రంగానికి చెందిన శాఖలన్నీ కలిపి ఉమ్మడిగా ఓ కమాండ్‌ కంట్రోల్‌రూం ఏర్పాటు చేసుకోవాలని సీఎం సూచించారు. అన్ని హాస్టళ్లలోని విద్యార్థులకు డిజిటల్‌ హెల్త్‌ రికార్డులు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని హాస్టళ్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పేర్కొన్నారు. విద్యార్థుల్లో ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకునేలా ఆత్మస్థైర్యం పెరిగేలా నిపుణులతో కౌన్సెలింగ్‌ ఇప్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. హాస్టళ్లలో నీటి సరఫరా విషయంలో పంచాయతీరాజ్‌, మున్సిపల్‌, సంక్షేమ, వైద్యారోగ్య శాఖలు కలిసి పనిచేయాలని అధికారులకు సూచించారు. అన్ని హాస్టళ్లలో నీటి నమూనాలు సేకరించాలన్నారు. ఎనిమియా, సికెల్‌సెల్‌ వ్యాధులపై అవగాహన కల్పించే బాధ్యత అధికారులపై ఉందని సీఎం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మం త్రులు డోలా బాలవీరాంజనేయస్వామి, గుమ్మిడి సంధ్యారాణి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 26 , 2025 | 04:31 AM