Share News

CM Chandrababu: తప్పుడు ప్రచారాలకు తావివ్వొద్దు

ABN , Publish Date - Aug 23 , 2025 | 05:56 AM

వరదలు, భారీ వర్షాలపై ఆయా ప్రాంతాల ప్రజల ఫోన్లకు నిరంతరం కచ్చితమైన సమాచారం ఇవ్వాలని, తప్పుడు ప్రచారాలకు తావు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

CM Chandrababu: తప్పుడు ప్రచారాలకు తావివ్వొద్దు

  • వర్షాలు, వరదల పరిస్థితిపై ప్రజలకు కచ్చితమైన సమాచారం ఇవ్వండి

  • అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు

  • కృష్ణా, గోదావరి వరదలు, ఎరువులపై సమీక్ష

  • ఓఎన్జీసీ గ్యాస్‌ పైప్‌ లీక్‌ ఘటనపైనా ఆరా

  • ఢిల్లీ నుంచి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌

అమరావతి, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): వరదలు, భారీ వర్షాలపై ఆయా ప్రాంతాల ప్రజల ఫోన్లకు నిరంతరం కచ్చితమైన సమాచారం ఇవ్వాలని, తప్పుడు ప్రచారాలకు తావు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సమస్య వచ్చాక అధికార యంత్రాంగం స్పందించడం కన్నా ముందుగానే సన్నద్ధమై ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. కృష్ణా, గోదావరి నదులకు ఎగువ నుంచి వస్తున్న భారీ ప్రవాహాలు, వరదల పరిస్థితిపై శుక్రవారం ఢిల్లీ నుంచి ఆయన అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సీఎస్‌ విజయానంద్‌, డీజీపీ హరీ్‌షకుమార్‌ గుప్తాతో పాటు వివిధ శాఖల అధికారులతో తాజా పరిస్థితులపై ఆరా తీశారు. రెండు నదులకు వస్తున్న ప్రవాహాలు, పలు ప్రాంతాల్లో నీట మునిగిన పంటలు, నివాస సముదాయాలకు సంబంధించిన పరిస్థితిని అధికారులు సీఎంకు వివరించారు. ఎగువ ప్రవాహాలతో కృష్ణా నదిలో శ్రీశైలం నుంచి 5.20 లక్షల క్యూసెక్కులు, నాగార్జున సాగర్‌ నుంచి 4.32 లక్షలు, పులిచింతల నుంచి 4.07 లక్షలు, ప్రకాశం బ్యారేజీ నుంచి 4.53 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గోదావరి నదిలోనూ భారీగా వరద ప్రవాహాలు వస్తున్నాయన్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 13,42,307 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల అవుతోందని చెప్పారు. గోదావరి వరదల కారణంగా పరివాహక ప్రాంతాల్లోని లంక గ్రామాలు, పోలవరం ముంపు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయని వివరించారు. ఈ ప్రాంతాల్లో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడంతో పాటు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎరువులు, పురుగు మందుల లభ్యత, సరఫరా అంశంపైనా సీఎం సమీక్ష చేశారు.


పైప్‌ మొత్తం తనిఖీ చేయండి

కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ధరియాల తిప్ప సమీపంలో ఓఎన్జీసీ గ్యాస్‌ పైప్‌లైన్‌ లీక్‌ ఘటనపై ఆ జిల్లా కలెక్టర్‌, ఇతర అధికారులతో సీఎం మాట్లాడారు. గురువారం అర్ధరాత్రి దాటాక 1.30 గంటలకు గ్యాస్‌ లీక్‌తో మంటలు భారీగా ఎగిసి పడ్డాయని, గంటన్నర వ్యవధిలోనే సరఫరా నిలిపి వేసి, లీక్‌ను అరికట్టినట్లు అధికారులు తెలిపారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని వివరించారు. లీకైన పైప్‌ను మొత్తం తనిఖీ చేసి, సమీప గ్రామాల ప్రజలు ఆందోళనకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని సూచించారు.

Updated Date - Aug 23 , 2025 | 05:57 AM