YogAndhra 2025: రికార్డు సృష్టించేలా యోగా డే
ABN , Publish Date - May 22 , 2025 | 06:38 AM
యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప వరమని, ప్రతి ఒక్కరి జీవితంలో ఇది భాగంగా మారాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. జూన్ 21న విశాఖలో యోగా డే కార్యక్రమాన్ని రికార్డు స్థాయిలో నిర్వహించేందుకు యోగాంధ్ర-2025 పేరిట నెల రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నారు.
జూన్ 21న విశాఖ ఆర్కే బీచ్లో 5 లక్షల మందితో భారీ కార్యక్రమం.. హాజరు కానున్న ప్రధాని మోదీ
రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నాం
ఈ నెల రోజులూ ‘యోగాంధ్ర-2025’
పాఠశాలల్లో ప్రతిరోజూ గంట శిక్షణ: సీఎం
అమరావతి, మే 21(ఆంధ్రజ్యోతి): ప్రపంచానికి భారతదేశం అందిస్తున్న గొప్ప వరం యోగా అని, ప్రతి ఒక్కరి జీవితంలో ఇది భాగం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఘనత ప్రధాని మోదీకి దక్కుతుందన్నారు. జూన్ 21న విశాఖపట్నంలో నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధాని హాజరవుతారని తెలిపారు. రికార్డు సృష్టించేలా యోగా డే నిర్వహిస్తామన్నారు. బుధవారం ఉండవల్లిలోని తన నివాసంలో సీఎం విలేకరులతో మాట్లాడారు. ‘మే 21 నుంచి జూన్ 21 వరకు నెల రోజుల పాటు యోగాంధ్ర-2025 పేరుతో రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించాం. యోగా మన దేశానికి వారసత్వంగా వస్తోంది. భారతీయ జీవన విధానంలో ఇది ఒక భాగం. మోదీ కృషి వల్ల 2014 డిసెంబరులో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రపంచమంతా యోగా దినోత్సవం జరపాలని తీర్మానించారు. యోగా ఒక ప్రాంతానికో, ఒక మతానికో సంబంధించినది కాదు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో జరుపుకొనే కార్యక్రమం. పోటీ ప్రపంచంలో ఒత్తిడి అనివార్యంగా మారుతోంది. ఒత్తిడికి యోగా ఒక్కటే మందు. ప్రపంచ రికార్డు సృష్టించేలా నేటి నుంచి యోగాంధ్ర-2025 పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తాం.

జూన్ 21న విశాఖ ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు 5 లక్షల మందితో ఉదయం 7-8 గంటలు కార్యక్రమం నిర్వహిస్తాం. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల మందికి తగ్గకుండా యోగా కార్యక్రమంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నాం. 10 లక్షల మందితో యోగా కోర్సులు చేయించి, వారికి సర్టిఫికెట్లు కూడా అందజేయాలని నిర్ణయించాం. అంతర్జాతీయ యోగా డే కార్యక్రమాల పర్యవేక్షణకు మంత్రి లోకేశ్ నేతృత్వంలో మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేశాం’ అని చంద్రబాబు తెలిపారు.
విస్తృతంగా అవగాహన: ‘‘రాష్ట్రంలో రూ.5 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం వచ్చే ఆలయాలు 21 ఉన్నాయి. అలాగే అమరావతి బుద్ధ స్తూపం, లేపాక్షి శిల్పారామం, గండికోట, అరకు, లంబసింగి, కోనసీమ, అఖండ గోదావరి ఇలా 100 వరకు పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశాల్లో యోగా ప్రాముఖ్యతను వివరించే ఏర్పాట్లు చేశాం. పెయింటింగ్, వ్యాసరచన, ఇతరత్రా కార్యక్రమాల ద్వారా యోగాపై ప్రజల్లో అవగాహన కల్పిస్తాం. ఇంటింటి ప్రచారం చేయాలని నిర్ణయించాం’ అని వరించారు. ఈ సందర్భంగా యోగాంధ్ర వెబ్సైట్ను ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్, పలువురు అధికారులు పాల్గొన్నారు.
Also Read:
Optical Illusion Test: మీవి డేగ కళ్లు అయితేనే.. ఈ గదిలో పెన్సిల్ను 5 సెకెన్లలో కనిపెట్టగలరు
Milk: ఇలాంటి వారికి పాలు డేంజర్.. ఎట్టి పరిస్ధితిలోనూ తాగకూడదు..
Little girl Stotram: వావ్.. ఈ బాలిక స్ఫూర్తికి సలాం.. శివ తాండవ స్త్రోత్రం ఎలా చెబుతోందో చూడండి