Share News

Delhi Visit: ఢిల్లీకి సీఎం.. నేడు అమిత్‌షాతో భేటీ

ABN , Publish Date - Dec 19 , 2025 | 04:55 AM

రాష్ట్రంలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు కేంద్రం సాయంపై మంత్రులతో చర్చించేందుకు సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు.

Delhi Visit: ఢిల్లీకి సీఎం.. నేడు అమిత్‌షాతో భేటీ

అమరావతి, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు కేంద్రం సాయంపై మంత్రులతో చర్చించేందుకు సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు. గురువారం సాయంత్రం అమరావతి నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లిన సీఎం రాత్రి అక్కడే బస చేయనున్నారు. శుక్రవారం ఆరుగురు కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ కానున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి, జల రవాణా శాఖ మంత్రి సర్బానంద్‌ సోనోవాల్‌తో సీఎం సమావేశం కానున్నారు. అనంతరం శుక్రవారం రాత్రి సీఎం అమరావతి చేరుకుంటారు.

పోలవరం స్టాప్‌వర్క్‌ ఆర్డర్‌ను శాశ్వతంగా ఎత్తేయండి

పోలవరం ప్రాజెక్టు స్టాప్‌వర్క్‌ ఆర్డర్‌ గడువు వచ్చే ఏడాది జూన్‌తో ముగుస్తోంది. ఈనేపథ్యంలో దానిని పూర్తిగా ఎత్తివేయాలని చందబ్రాబు కేంద్ర మంత్రి సీఆర్‌ పాటిల్‌ను కోరనున్నారు. ‘పోలవరం రెండో దశ పనులకు ఆమోదం, ప్రస్తుత ఎస్‌ఎ్‌సఆర్‌ ప్రకారం అంచనా వ్యయంతో సహా భూసేకరణ, సహాయ పునరావాసానికి నిధులు కేటాయింపు, పోలవరం ప్రాజెక్టు కోసం అదనంగా కాలువల తవ్వకాలు, ఇతరపనుల కోసం వ్యయంచేసిన రూ.1,700కోట్ల విడుదలపై సీఎం చర్చించనున్నారు.

Updated Date - Dec 19 , 2025 | 04:55 AM