Gulf Visit: 24న సీఎం గల్ఫ్ పర్యటన
ABN , Publish Date - Oct 13 , 2025 | 04:39 AM
సీఎం చంద్రబాబు ఈ నెల 24 నుంచి రెండు రోజుల పాటు గల్ఫ్ దేశాలలో పర్యటించనున్నారు. తొలుత దుబాయ్, తర్వాత అబుధాబిలలో పర్యటించనున్న ఆయన..
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)
సీఎం చంద్రబాబు ఈ నెల 24 నుంచి రెండు రోజుల పాటు గల్ఫ్ దేశాలలో పర్యటించనున్నారు. తొలుత దుబాయ్, తర్వాత అబుధాబిలలో పర్యటించనున్న ఆయన.. అక్కడి ప్రవాసాంధ్రులతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. పీ-4 సహా పెట్టుబడులపై వారితో చర్చించనున్నారు. ముఖ్యమంత్రి గల్ఫ్ పర్యటనకు కేంద్రం అనుమతిచ్చింది. అదేసమయంలో ప్రవాసులతో భేటీకి అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు ముందుకు వచ్చింది. ఇదిలావుంటే, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా ఈ నెల 16 నుంచి గల్ఫ్ దేశాల్లో పర్యటించాలని భావించారు. ఈ పర్యటన ద్వారా ఆయా దేశాల్లోని ప్రవాసీ మలయాళీలను కలుసుకోవాలని నిర్ణయించారు. విశ్వవ్యాప్తంగా ఉన్న కేరళ ప్రవాసీయులలో మలయాళీ భాష వ్యాప్తి, వారి సంక్షేమానికి తమ ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించేందుకు ఆయన ఈ పర్యటనకు సిద్ధమయ్యారు. అయితే.. కేంద్రం ఆయనకు అనుమతులు నిరాకరించింది.