CM Chandrababu: మొంథాను ఎదుర్కొందాం
ABN , Publish Date - Oct 27 , 2025 | 04:46 AM
మొంథా తుఫాన్ రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండటంతో అధికార యంత్రాంగాన్ని సీఎం చంద్రబాబు అప్రమత్తం చేశారు.
మచిలీపట్నం నుంచి కాకినాడ వరకు తీవ్ర ప్రభావం
తీర ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలి
ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి
ప్రజలకు ముందస్తు హెచ్చరికలు పంపాలి
ప్రతి విభాగం సమన్వయం చేసుకోవాలి
సీఎం చంద్రబాబు నిర్దేశం... అధికారులతో టెలీకాన్ఫరెన్స్
అమరావతి, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్ రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండటంతో అధికార యంత్రాంగాన్ని సీఎం చంద్రబాబు అప్రమత్తం చేశారు. ఈనెల 27, 28, 29తేదీల్లో తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, తీవ్రమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ఆదివారం అధికారులతో సీఎం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వాయుగుండం 28నాటికి తీవ్ర తుఫాన్గా మారుతుందని, ఈ సమయంలో ఎక్కడా, ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు నిర్ధేశించారు. మొంథా తుఫాన్ను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు వివిధ జిల్లాలకు ఇప్పటికే ప్రత్యేక అధికారులను నియమించామని, ప్రతి శాఖ, ప్రతి విభాగం సమన్వయంతో పని చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. తుఫాన్ నుంచి ప్రజల ఆస్తి, ప్రాణ, మౌలిక సదుపాయాల రక్షణకు ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. మచిలీపట్నం నుంచి కాకినాడ వరకు తుఫాన్ తీవ్ర ప్రభావం చూపిస్తుందని, ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేసేలా సమాచార వ్యవస్థలు సిద్ధంగా ఉండాలని సీఎం సూచించారు. ఎస్ఎంఎస్ అలెర్ట్స్, సోషల్ మీడియా, ఐవీఆర్ఎస్ కాల్స్, వాట్సాప్ల ద్వారా ప్రజలకు ముందస్తు హెచ్చరికలు పంపాలన్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తుఫాన్ ప్రభావంపై సమాచారం వేగంగా చేరవేసి, నష్ట నివారణ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే తీర ప్రాంత జిల్లాల్లో మొహరించాయన్న సీఎం.. తుఫాన్ఫై ప్రెడిక్టివ్ మోడల్, రియల్ టైమ్ డేటా ఆధారంగా విశ్లేషణ చేస్తున్నామన్నారు. రిజర్వాయర్లు, ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో నీటి మట్టాలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా 27వేల సెల్ఫోన్ టవర్లును డీజిల్ జనరేటర్లతో సిద్ధం చేశామని చెప్పారు. విద్యుత్, టెలికం, తాగునీటి సరఫరా వ్యవస్ధకు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. సముద్ర తీర ప్రాంత ప్రజలను తక్షణమే సమీపంలోని తుఫాన్ రక్షణ కేంద్రాలకు తరలించి, పునరావాసం కల్పించాలని ఆదేశించారు. తుఫాన్ తీవ్రతను బట్టి విద్యాసంస్థలకు కలెక్టర్లు సెలవులు ప్రకటించాలని సూచించారు. రహదారులు, చెరువులు, కాలువ గట్లు కోతకు గురైతే తక్షణం మరమ్మతులు చేసేలా ఏర్పాట్లు చేసుకోవాలని, చెట్లు కూలిపోయినా, కొమ్మలు విరిగిపడినా వాటిని తొలగించడానికి అవసరమైన క్రేన్లు, జేసీబీలు ప్రతి సబ్ డివిజన్ స్థాయిలో సిద్ధం చేయాలని, డ్రోన్ల ద్వారా సహాయక చర్యలు చేపట్టేలా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. మరోవైపు పంట నష్టం వివరాలను స్పష్టంగా తెలుసుకునేలా వ్యవసాయ శాఖ, ఆర్టీజీఎస్ వ్యవస్థ సమన్వయంతో పని చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఇంకా సముద్రంలోనే ఉన్న 82 మెకనైజ్డ్ పడవలు, 37 మోటరైజ్డ్ పడవలను సురక్షితంగా తీరానికి రప్పించే చర్యలు తీసుకో వాలన్నారు. తుఫాన్ రక్షణ చర్యలపై ఇప్పటికే 11సార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించామని అధికారులు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు జాతీయ రహదారులపై వాహనాలు సిద్ధం చేశామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 851 జేసీబీలు, క్రేన్లు సిద్ధంగా ఉంచామని వివరించారు.
ఉద్యానశాఖ డైరెక్టరేట్లో హెల్ప్లైన్
మొంథా తుఫాన్ నేపథ్యంలో ఉద్యాన రైతుల కోసం గుంటూరులోని డైరెక్టరేట్లో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు ఉద్యానశాఖ డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. ఉద్యాన తోటలకు నష్టం జరిగితే సూచనలు, సలహాల కోసం హెల్ప్లైన్ నంబరు 0863-2216470లో సంప్రదించాలని కోరారు. అధిక వర్షాల వల్ల పండ్ల తోటలు దెబ్బతినకుండా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వాన నీటిని తీసేసి, బూస్టర్ డోస్గా శాస్త్రవేత్తల సిఫారసు మేరకు ఎరువులు వేసుకోవాలని సూచించారు. గత వారంలో అధిక వర్షాల కారణంగా 21 జిల్లాల్లో 15 మండలాల్లో 23 గ్రామాల్లో 283 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిపారు.