వరికెపూడిసెలను పూర్తి చేద్దాం: సీఎం
ABN , Publish Date - Oct 01 , 2025 | 05:14 AM
పల్నాడు జిల్లావాసుల చిరకాలవాంఛ వరికెపూడిసెల ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడంపై దృష్టి సారించాలని సీఎం చంద్రబాబు...
అమరావతి, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): పల్నాడు జిల్లావాసుల చిరకాలవాంఛ వరికెపూడిసెల ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడంపై దృష్టి సారించాలని సీఎం చంద్రబాబు జల వనరుల శాఖను ఆదేశించారు. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గంగులకుంట్లలోని వరికపూడి వాగుపై ఈ ఎత్తిపోతలను తలపెట్టారు. వరద సమయంలో నాగార్జునసాగర్ ఫోర్షోర్ నుంచి రోజుకు 1.55 టీఎంసీల చొప్పున ఎత్తిపోసి.. పైప్లైన్ నెట్వర్క్ ద్వారా 24,500 ఎకరాలకు సాగు, 20,000 మందికి తాగునీటిని అందించడం ఈ పథకం ఉద్దేశం. దీనిపై సోమవారం రాత్రి సీఎం సమీక్ష జరిపారు. దీని ప్రారంభ అంచనా రూ.340 కోట్లు. ఇప్పుడు రూ.643 కోట్లకు పెరిగింది. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమతుల కోసం దరఖాస్తు చేయనున్నారు.