CM Chandrababu: విషం చిమ్మేవారితో జాగ్రత్త
ABN , Publish Date - Aug 19 , 2025 | 03:53 AM
రాష్ట్రంలో నేరచరిత్ర కలిగిన ఒక పార్టీ ఉంది. వాళ్ల పని నిత్యం విషం చిమ్మడమే. తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు ఖండించాలి.మంత్రులు, పార్టీ నేతలు ఈ విషయంలో మరింత చొరవ చూపాలి
రాజధాని కోసం పొన్నూరును ముంచామంటారు
ప్రకాశం బ్యారేజీ ప్రమాదంలో పడిందంటారు
ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయాలనేదే లక్ష్యం
చొరవతో నాయకులు, మంత్రులు తిప్పికొట్టాలి
టెలికాన్ఫరెన్స్లో టీడీపీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం
‘‘మనం చేసే మంచి ఒక్కటే చెబితే సరిపోదు. చెడు చేసే వారి గురించి కూడా ప్రజలను చైతన్యపరచాలి. రాజధాని కోసం పొన్నూరును ముంచారని, కొండవీటి వాగు ఎత్తిపోతల పంపులు పనిచేయడం లేదని , గేటు పనిచేయక ప్రకాశం బ్యారేజీ ప్రమాదంలో పడిందని వైసీపీ తన సొంత టీవీ, పత్రికలతోపాటు అనుబంధ మీడియా, సోషల్ మీడియాల్లో అసత్యాలు ప్రచారం చేయిస్తోంది. తప్పుడు వార్తలతో ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాల్జేసే లక్ష్యంతో రోజూ పనిచేస్తున్నారు.’’
- చంద్రబాబు
అమరావతి, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రంలో నేరచరిత్ర కలిగిన ఒక పార్టీ ఉంది. వాళ్ల పని నిత్యం విషం చిమ్మడమే. తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు ఖండించాలి.మంత్రులు, పార్టీ నేతలు ఈ విషయంలో మరింత చొరవ చూపాలి. లేకపోతే ప్రజలు ఆ తప్పుడు ప్రచారాలనే నిజమని నమ్మే ప్రమాదం ఉంది’’అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్సీలు, పార్లమెంటు అధ్యక్షులు, కో-ఆర్డినేటర్లు, జోనల్ కో-ఆర్డినేటర్లు, గ్రామ, మండల స్థాయి కార్యకర్తలతో చంద్రబాబు సోమవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా రాజధానిలో వరద అంటూ, ‘స్త్రీశకి’్తని పరిమితం చేశారంటూ వైసీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని సీఎం ప్రస్తావించారు. వైసీపీ తన సొంత టీవీ, పత్రికలతోపాటు అనుబంధ మీడియా, సోషల్ మీడియాల్లో అసత్యాలు ప్రచారం చేయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మనం చేసే మంచి గురించి మాట్లాడడమే కాదు.. చెడు చేసే వారి గురించీ ప్రజలను చైతన్యపరచాలన్నారు. రాజకీయ ముసుగులో ఉండే రౌడీలను కట్టడి చేయాలని..వారిపట్ల కఠినంగా ఉంటామని స్పష్టం చేశారు.వైసీపీ అసత్య ప్రచారాలను దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యేలు, ఎంపీలు,ఇన్చార్జులు, కార్యకర్తలు మరింత క్రమశిక్షణతో ఉండాలని ఆదేశించారు. ‘ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు మరింత బాధ్యతగా ఉండాలి.మీ మాట, మీ చర్య పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ఉండకూడదు. వివాదాలకు ఆస్కారం ఇవ్వకూడదు.
అమలుచేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చేపట్టిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ విజయవంతమైంది. రాష్ట్రంలో 1.24 కోట్ల కుటుంబాలను నేరుగా కలిశాం. అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా చూస్తే ప్రభుత్వ పథకాల పట్ల ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతోంది. ప్రభుత్వ పాలనపై ఇదొక పాజిటివ్ సైన్. ఎన్నికల్లో చెప్పిన విధంగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నాం కాబట్టే ఈ స్థాయి సంతృప్తి వ్యక్తమైంది. ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లండి. దీని కోసం నాయకులు ఎప్పుడూ ప్రజల్లోనే ఉండాలి’ అని ఆదేశించారు.
కష్టపడిన వారికే పదవులు
‘పార్టీ పదవులైనా.. నామినేటెడ్ పదవులైనా పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలతోనే భర్తీ చేస్తున్నాం. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించాం. ఇతర పదవుల భర్తీ కూడా త్వరలోనే పూర్తి చేస్తాం.పార్టీ కమిటీలను సాధ్యమైనంతవరకు ఈ నెలాఖరుకు పూర్తి చేయాలి. ఎమ్మెల్యేలు, ఇన్చార్జులతో ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తున్నాం. వారి మంచి చెడులను వివరించి, పొరపాట్లు ఉంటే సరిదిద్దుకోవాలని సూచిస్తున్నాం. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పార్టీ విజయానికి కార్యకర్తలు,నేతలు కృషి చేశారు. వారికి అభినందనలు. టీడీపీ అభ్యర్థులను గెలిపించి కాలర్ ఎగరేసుకుని తిరిగేలా, గర్వపడేలా అంతా పనిచేశారు. ‘వివేకానందరెడ్డికి న్యాయం చేయండి’, ‘30 ఏళ్ల తర్వాత ఓటు వేసే అవకాశం కల్పించినందుకు దండాలు’ అంటూ బ్యాలెట్ బాక్సులో రాసి వేశారు.ఇది పులివెందులలో పరిస్థితికి అద్దం పడుతోంది. నామినేషన్ల నుంచి పోలింగ్ వరకు చట్టబద్ధంగా వ్యవస్థలు పనిచేశాయి.కాబట్టే అంతమంది పోటీ చేశారు.అంతమంది స్వేచ్ఛగా ఓట్లు వేశారు. రాబోయే రోజుల్లో ఏ ఎన్నిక వచ్చినా కూటమి అభ్యర్థులు గెలవాలి.ప్రజలతో మమేకమై, వారి అవసరాలు తీర్చి, సమస్యలు పరిష్కరిస్తే ప్రతి ఎన్నికల్లోనూ సునాయాసంగా గెలుస్తాం’ అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.