Share News

CM Chandrababu Naidu: వేగంగా మెరుగైన సేవలు

ABN , Publish Date - Dec 25 , 2025 | 04:45 AM

స్పీడ్‌ ఆఫ్‌ డెలివరింగ్‌ గవర్నెన్స్‌లో భాగంగా పౌరులకు మెరుగైన సేవలు వేగంగా అందించేందుకు ప్రతి శాఖ ఇండికేటర్లు సిద్ధం చేసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు....

CM Chandrababu Naidu: వేగంగా మెరుగైన సేవలు

  • స్పీడ్‌ ఆఫ్‌ డెలివరింగ్‌ గవర్నెన్స్‌లో అందించాలి

  • ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రతే లక్ష్యం కావాలి

  • రైతు ఆత్మహత్యల నివారణకు కార్యాచరణ చేపట్టాలి

  • నైపుణ్య ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం: సీఎం

అమరావతి, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): స్పీడ్‌ ఆఫ్‌ డెలివరింగ్‌ గవర్నెన్స్‌లో భాగంగా పౌరులకు మెరుగైన సేవలు వేగంగా అందించేందుకు ప్రతి శాఖ ఇండికేటర్లు సిద్ధం చేసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాలు, పది సూత్రాల అమలుపై సచివాలయంలో ఆయా శాఖల నోడల్‌ అధికారులతో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధన కోసం రూపొందించిన పది సూత్రాలను పది మిషన్లుగా నిర్దేశించుకుని పనిచేయాలని సూచించారు. జీరో పావర్టీ మిషన్‌లో భాగంగా పీ4 విధానాన్ని ముందుకు తీసుకెళ్లడంతో పాటు పథకం అమలును విజన్‌ మానిటరింగ్‌ యూనిట్ల ద్వారా పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ప్రతి కుటుంబమూ సాధికారిత సాధించాలని, అలాగే వ్యక్తులకు ఆర్థిక భద్రత కల్పించడమే ఈ మిషన్‌ ముఖ్య లక్ష్యమన్నారు. వివిధ సంక్షేమ పథకాల అమలుతో రాష్ట్రంలోని 30 లక్షల బీపీఎల్‌ కుటుంబాలకు ఎంత ప్రయోజనం కలిగిందో అంచనా వేయాలని ఆదేశించారు. పాపులేషన్‌ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి విధానాన్ని రూపొందించాలని దిశానిర్దేశం చేశారు. నైపుణ్య ఉద్యోగాల కల్పన అనేది అత్యంత ప్రాధాన్య అంశంగా తీసుకోవాలని స్పష్టం చేశారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనే మొట్టమొదటి ప్రాధాన్యంగా పనిచేయాలన్నారు. నైపుణ్యం పోర్టల్‌ ద్వారా ఈ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో ఉంచాలని సూచించారు. పది సూత్రాలకు సంబంధించిన అంశాలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలని తెలిపారు. నీటి వనరుల సమర్థ వినియోగంతో పాటు నీటి ఆడిట్‌ నిర్వహించాలని ఆదేశించారు. నీటి వినియోగంలో వివాదాలు లేకుండా చూడాలని.. .రెండు తెలుగు రాష్ట్రాలు సస్యశ్యామలంగా ఉండాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. రాష్ట్రంలో కరువు అనే మాట లేకుండా వరద నీటి నిర్వహణ జరగాలని పేర్కొన్నారు. టెక్నాలజీ వినియోగంతో సాగు వ్యయం తగ్గేలా చూడాలన్నారు. డిమాండ్‌ ఆధారిత పంటల ఉత్పత్తి, కోల్డ్‌ చైన్‌, పుడ్‌ ప్రాసెసింగ్‌ లాంటి అంశాలపై దృష్టిపెట్టి రైతులకు ప్రయోజనం కలిగేలా చూడాలని అన్నారు. రైతు ఆత్మహత్యల నివారణకు సంబంధించి కార్యాచరణ చేపట్టాలని సీఎం ఆదేశించారు.


లాజిస్టిక్స్‌ రంగాన్ని తీర్చిదిద్దాలి: రాష్ట్రంలో రవాణా వ్యయాన్ని గణనీయంగా తగ్గించేలా లాజిస్టిక్స్‌ రంగాన్ని తీర్చిదిద్దాలని చంద్రబాబు స్పష్టం చేశారు. రోడ్లు, రైతులు, అంతర్గత జల రవాణా, సీకార్గో, ఎయిర్‌ కార్గో లాంటి అంశాలతో పాటు కోల్డ్‌చైన్‌ లాంటి మౌలిక సదుపాయాల కల్పనకు లాజిస్టిక్స్‌ మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాలని ఆదేశించారు. విద్యుత్‌, ఇంధన వ్యయాలను తగ్గించే అంశంపైనా దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో తయారయ్యే ఉత్పత్తుల నాణ్యతతో పాటు మేడ్‌ ఇన్‌ ఆంధ్రా బ్రాండ్‌ను ప్రపంచవ్యాప్తం చేసేలా స్పష్టమైన విధానం ఉండాలని దిశానిర్దేశం చేశారు. స్వచ్ఛాంధ్రలో భాగంగా సర్క్యులర్‌ ఎకానమీని ప్రోత్సహించడంతో పాటు గాలి, నీటి నాణ్యతల్లో అత్యున్నత ప్రమాణాలు పాటించాలన్నారు. కేంద్ర నిధుల్ని సమర్థంగా వినియోగించుకోవాలన్నారు. రెసిడెన్షియల్‌ హాస్టళ్లలో ఆర్గానిక్‌ కూరగాయల ఉత్పత్తిపై ఆలోచన చేస్తున్నట్లు వెల్లడించారు. పౌరసేవలు సులభంగా అందేలా శాఖలన్నీ సాంకేతికతను అందిపుచ్చుకోవాలని... ఆర్టీజీఎస్‌ ద్వారా సమాచారాన్ని సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో సీఎస్‌ విజయానంద్‌, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Updated Date - Dec 25 , 2025 | 04:45 AM