CM Chandrababu: ఆచితూచి మాట్లాడండి
ABN , Publish Date - Dec 12 , 2025 | 06:08 AM
జాతీయ, రాష్ట్ర స్థాయిలో జరిగే తాజా పరిణామాలపై పార్టీ అధికార ప్రతినిధులు పూర్తి అవగాహన కలిగి మాట్లాడాలని సీఎం చంద్రబాబు సూచించారు.
తాజా పరిణామాలపై అప్డేట్గా ఉండండి
మన పరిధి ఏమిటో తెలుసుకొని స్పందించండి
పార్టీ అధికార ప్రతినిధులకు సీఎం చంద్రబాబు సూచనలు
అమరావతి, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): జాతీయ, రాష్ట్ర స్థాయిలో జరిగే తాజా పరిణామాలపై పార్టీ అధికార ప్రతినిధులు పూర్తి అవగాహన కలిగి మాట్లాడాలని సీఎం చంద్రబాబు సూచించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం పార్టీ అధికార ప్రతినిధులతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ అంశాలపై మాట్లాడే సమయంలో జాగ్రత్తగా లేకుంటే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఇటీవల చూశామని వ్యాఖ్యానించారు. తాజా పరిణామాలపై ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలని, దానిలో మన పాత్ర ఎంత వరకు అనేది తెలుసుకోవాలని సూచించారు. బీజేపీ నాయకులు ఏదైనా అంశంపై మాట్లాడాల్సి వస్తే.. జాతీయ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఒకే లైన్లో మాట్లాడతారని, మన పార్టీ నాయకులూ అదే తరహాలో స్పందించాలని నిర్దేశించారు. ఒక అంశంపై మన పార్టీ లైన్ ఏమిటి? ప్రభుత్వ విధానం ఏమిటి? ఆ అంశంలో మన పాత్ర ఎంత వరకు ఉంటుంది? అనే విషయాలపై కనీస అవగాహన లేకుండా మాట్లాడవద్దని తేల్చిచెప్పారు. రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీతో కలిసి పనిచేస్తున్నామని, అదే సమయంలో ఎవరి పరిధి ఏమిటనే దానిపై పూర్తి అవగాహనతో ముందుకెళ్తున్నామని సీఎం పేర్కొన్నారు.