Tirumala Global Spiritual Glory: తిరుమల వైభవం విశ్వవ్యాప్తం
ABN , Publish Date - Nov 28 , 2025 | 05:54 AM
ప్రపంచం నలుమూలలా తిరుమల తిరుపతి ఆధ్యాత్మిక వైభవాన్ని చాటేలా కార్యక్రమాలు రూపొందించాలని టీటీడీ అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు...
వైకుంఠ ఏకాదశి దర్శనాలకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలి: సీఎం
అమరావతి, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): ప్రపంచం నలుమూలలా తిరుమల తిరుపతి ఆధ్యాత్మిక వైభవాన్ని చాటేలా కార్యక్రమాలు రూపొందించాలని టీటీడీ అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. వైకుంఠ ఏకాదశికి పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని, ఎక్కడా సమస్యలు ఉత్పన్నం కాకూడదని ఆదేశించారు. గురువారంలో సచివాలయంలో దేవదాయ శాఖ, టీటీడీపై ఆయన సమీక్ష నిర్వహించారు. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు భక్తులు అన్ని భాషల్లోనూ రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించాలని చెప్పారు. వీలైనంత ఎక్కువమంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. టీటీడీ ఆధ్వర్యంలో నడిచే అన్ని దేవాలయాల్లో నిత్యాన్నదానం చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. ఆధ్యాత్మికం, అన్నదానం, విద్య, వైద్యానికి టీటీడీ చిరునామాగా మారాలని ఆకాంక్షించారు. తిరుపతిలో ఉన్న ఆస్పత్రులన్నీ ఓ మోడల్గా అభివృద్ధి చేయాలని, పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ఆస్పత్రుల తరహాలోనే వీటి నిర్వహణ కూడా చేపట్టాలని ఆదేశించారు. స్విమ్స్, రుయా, బర్డ్ ఆస్పత్రులను అనుసంధానిస్తూ మెరుగైన వసతులు కల్పించాలన్నారు. అత్యుత్తమ నిపుణులైన డాక్టర్లను శ్రీవారి సేవకులుగా ఆహ్వానించి వైద్య సేవ చేసే అవకాశం కల్పించాలని టీటీడీని ఆదేశించారు. అత్యవసర సమయాల్లో క్యూలైన్లలోని భక్తులను వేగంగా ఆస్పత్రులకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. తిరుమలలో కాలుష్య నివారణకు ఎలకా్ట్రనిక్ వాహనాలు దశల వారీగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. టీటీడీ సేవలను వాట్సాప్ గవర్నెన్స్లోకి తీసుకువచ్చి భక్తులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ప్రసాదాల తయారీ కోసం ఆర్గానిక్ ఉత్పత్తులు ఎంచుకోవాలని తెలిపారు. టీటీడీ పోర్టల్ను ఆర్టీజీఎ్సతో అనుసంధానించాలని చంద్రబాబు ఆదేశించారు.
5 వేల ఆలయాలు రీడిజైన్
రాష్ట్రంలో కొత్తగా నిర్మించనున్న 5వేల దేవాలయాలను రీడిజైన్ చేయాలని సీఎం అన్నారు. ఆ దేవాలయాల్లో ఆధ్యాత్మికత, ప్రశాంతత ఉట్టిపడేలా ప్రత్యేకంగా ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. పురాతన దేవాలయాల జీర్ణోద్ధరణపై కార్యాచరణ చేపట్టాలన్నారు. వివిధ రాష్ట్రాల్లో 8 దేవాలయాలతో పాటు నవీ ముంబై, తమిళనాడులోని ఉలందూర్పేటలో కొత్తగా శ్రీవారి ఆలయాలు నిర్మిస్తున్నట్టు అధికారులు వివరించారు. కోయంబత్తూరులోనూ ఆలయ నిర్మాణానికి ఓ భక్తుడు ముందుకొచ్చారని తెలిపారు. అసోంలో టీటీడీ ఆలయ నిర్మాణానికి 10 ఎకరాలను ఆ రాష్ట్ర మఖ్యమంత్రి కేటాయించారని చెప్పారు. దీనిపై స్పందించిన చంద్రబాబు... మరింత స్థలాన్ని కేటాయించాలని కోరతామని తెలిపారు. దేశ, విదేశాల్లో నిర్మించే ప్రతీ ఆలయం తిరుమల ఆలయానికి అనుసంధానం కావాలని, శ్రీవారి ధనానికి, ఆస్తులకు జవాబుదారీగా ఉండాలని, దుర్వినియోగానికి చోటులేకుండా పారదర్శకంగా నిర్వహించాలని సీఎం పేర్కొన్నారు. ఒంటిమిట్ట రామాలయంలో భక్తుల సంఖ్య పెరిగేలా కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
శ్రీవారి ఆలయంలో వేగంగా దర్శనం
తిరుమల శ్రీవారి ఆలయానికి వచ్చే సామాన్య భక్తులకు వేగంగా దర్శనాలు జరిగేలా వినూత్న కార్యాచరణ చేపట్టాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం నిమిషానికి 8 మంది చొప్పున దర్శనాలు చేసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. పండుగలు, ప్రత్యేక రోజుల్లో సాదారణ భక్తులకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. లడ్డూ నాణ్యతను పెంచటంతో పాటు అన్నప్రసాదంలో వడ కూడా అందిస్తున్నామని, కిచెన్ను ఆధునీకరించి 2.75 లక్షల మందికి అన్నప్రసాదం అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. సమీక్షలో దేవదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు, ఈవో సింఘాల్, జేఈవో వెంకయ్య చౌదరి, దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.