చిత్తూరు ఎస్పీ రౌడీలా వ్యవహరించాడు: అంబటి
ABN , Publish Date - Jul 12 , 2025 | 05:05 AM
మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆయన సోదరుడు అంబటి మురళి, వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డిలు శుక్రవారం పోలీసుల విచారణకు హాజరయ్యారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా.....
పోలీసు విచారణకు హాజరైన మాజీ మంత్రి
సత్తెనపల్ల్లి, జూలై 11(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆయన సోదరుడు అంబటి మురళి, వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డిలు శుక్రవారం పోలీసుల విచారణకు హాజరయ్యారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా జూన్ 18వ తేదీన పల్నాడు జిల్లా సత్తెనపల్లి పోలీసు స్టేషన్లో నమోదైన కేసుకు సంబందించి పట్టణ సీఐ నాగమల్లేశ్వరరావు వారిని విచారించారు. విచారణలో భాగంగా ఎప్పుడు పిలిస్తే అప్పుడు స్టేషన్కు రావాలన్నారు. జగన్ పర్యటన సందర్భంగా బారికేడ్లను తొలగించి పోలీసు విధులకు ఆటంకం కలిగించారని కూడా అంబటి సోదరులపై కేసు నమోదైంది. దానిపై కూడా పోలీసులు వారిని విచారించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ, వైఎస్ జగన్ పర్యటనలో తాము పాల్గొనటం వల్లే పోలీసులు కేసులు పెట్టారన్నారు. జగన్ పర్యటన సందర్భంగా 1300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసి 113 మంది వైసీపీ శ్రేణులపై కేసులు నమోదు చేశారన్నారు. జగన్ బంగారుపాళ్యం పర్యటనకు వెళితే చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ ఓ రౌడీలా వ్యవహరించాడన్నారు. జిల్లా ఎస్పీలు పోలీసుల్లాగా వ్యవహరించటం లేదని, ఇలానే కొనసాగితే పోలీసులపై ప్రైవేట్ కేసులు నమోదు చేస్తామని రాంబాబు హెచ్చరించారు.