Kanha Shanti Vanam: నేడు శాంతివనానికి బాబు
ABN , Publish Date - Dec 15 , 2025 | 04:50 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ మండలంలో ఉన్న కన్హా శాంతి వనాన్ని సందర్శించనున్నారు.
వెల్నెస్, మెడిటేషన్ సెంటర్ను పరిశీలించనున్న ముఖ్యమంత్రి
సాయంత్రం బెజవాడలో అమరజీవి ‘ఆత్మార్పణ దినం’ కార్యక్రమానికి హాజరు
అమరావతి, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ మండలంలో ఉన్న కన్హా శాంతి వనాన్ని సందర్శించనున్నారు. సోమవారం ఉదయం జూబ్లీహిల్స్లోని తన నివాసం నుంచి బయల్దేరి 11 గంటలకు శాంతివనం చేరుకుంటారు. ఆశ్రమం అధ్యక్షుడు కమలేశ్ డి.పటేల్ దాజీతో సమావేశమవుతారు. రెండు గంటలు అక్కడే ఉండి.. వెల్నెస్, మెడిటేషన్ సెంటర్, యోగా కేంద్రాలను తిలకిస్తారు. ట్రీ కన్జర్వేషన్ సెంటర్, రెయిన్ ఫారెస్ట్ కేంద్రం, మెడిటేషన్ సెంటర్, బయోచార్ కేంద్రం, పుల్లెల గోపీచంద్ స్టేడియంతో పాటు హార్టిఫుల్నెస్ ఇంటర్నేషనల్ స్కూలును సందర్శిస్తారు. అనంతరం శాంతివనం వ్యవస్థాపకుడు దాజీ నివాసానికి వెళ్తారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో 1,400 ఎకరాల్లో కన్హా శాంతి వనాన్ని శ్రీరామచంద్ర మిషన్ అభివృద్ధి చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద మెడిటేషన్ సెంటర్ ఇక్కడ ఉంది. అంతేగాక.. 8 లక్షలకు పైగా వివిధ జాతుల వృక్షాలతో బయోడైవర్సిటీ కేంద్రంగా ఈ ఆశ్రమం పర్యాటకులను పెద్దసంఖ్యలో ఆకర్షిస్తోంది. యువతను గ్లోబల్ లీడర్లుగా తయారు చేసేందుకు ఈ ఆశ్రమం అధ్యక్షుడు దాజీ నేతృత్వంలో ‘హార్ట్ ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లీడర్షి్ప’ను ఇక్కడ నిర్వహిస్తున్నారరు. ‘కౌశలం’ పేరిట శిక్షణ కార్యక్రమాలను చేపడుతున్నారు. కన్హా శాంతివనంలోని సుస్థిర వ్యవసాయ క్షేత్రాన్ని కూడా చంద్రబాబు సందర్శించనున్నారు. అనంతరం ఆయన అమరావతికి చేరుకుంటారు. సాయంత్రం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్రప్రభుత్వం నిర్వహిస్తున్న అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమానికి హాజరవుతారు.