Chandrababu Praised for Vision: చంద్రబాబు తిరుగులేని వ్యక్తి
ABN , Publish Date - Nov 20 , 2025 | 04:49 AM
ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర బుధవారం సీఎం చంద్రబాబును ఉద్దేశించి ఎక్స్లో చేసిన పోస్టు ఆసక్తికరంగా మారింది....
పాలసీల రూపకల్పనలో ఆయన ఆలోచనలకు హ్యాట్సాఫ్: ఆనంద్ మహీంద్ర
ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసంసరికొత్తదారులు వేస్తున్నాను: చంద్రబాబు
అమరావతి, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర బుధవారం సీఎం చంద్రబాబును ఉద్దేశించి ఎక్స్లో చేసిన పోస్టు ఆసక్తికరంగా మారింది. ‘చంద్రబాబు తిరుగులేని వ్యక్తి. అభివృద్ధి పట్ల ఆయనపడే తపన ఒక్కటే కాదు పాలసీల రూపకల్పలో ఆయన వినూత్న ఆలోచనలు దశాబ్దాలుగా నన్ను అబ్బురపరుస్తూనే ఉన్నాయి. ఆయన ఎప్పటికప్పుడు తాను ఎదగడంతోపాటు తన చుట్టూ ఉన్నవారిని కూడా ఉన్నతంగా ఉంచేందుకు ప్రయత్నిస్తుంటారు’ అని ఆనంద్ మహీంద్ర ఎక్స్ వేదికగా స్పందించారు. తన సందేశానికి విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సు వీడియోను ఆనంద్ మహీంద్ర ట్యాగ్ చేశారు. దీనిపై సీఎం చంద్రబాబు స్పందించారు. ‘ఆనంద్జీ మీ స్ఫూర్తిదాయక మాటలకు ధన్యవాదాలు. భారతదేశం ఓ అద్భుతమైన అభివృద్ధి చెందే దశలోకి అడుగుపెడుతోందని నేను బలంగా నమ్ముతున్నాను. ఇలాంటి సమయంలో పాలకులుగా మేం చేయాల్సింది ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం సరికొత్త దారులను పరిచేందుకు వినూత్న పాలసీలను రూపొందించడమే. దానిలో భాగంగానే నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. మీలాంటి వారి రాక కోసం ఆంధ్రప్రదేశ్ ఎదురుచూస్తోంది’ అని సీఎం పేర్కొన్నారు.