Share News

Medical Seats: దేశవ్యాప్తంగా కొత్తగా 10,023 మెడికల్‌ సీట్లు

ABN , Publish Date - Sep 25 , 2025 | 04:11 AM

వైద్య విద్యకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ కాలేజీల్లో కొత్తగా 10,023 యూజీ, పీజీ వైద్య విద్య సీట్లను మంజూరు చేసింది.

Medical Seats: దేశవ్యాప్తంగా కొత్తగా 10,023 మెడికల్‌ సీట్లు

  • ఇందులో ఎంబీబీఎస్‌ సీట్లు 5,023.. పీజీ సీట్లు 5 వేలు

  • ప్రభుత్వ కాలేజీల్లో మంజూరుకు కేంద్రం నిర్ణయం

  • 2028-29కల్లా కొత్త సీట్లు అందుబాటులోకి

  • ఏపీలో 250-300 యూజీ సీట్లు వచ్చే అవకాశం!

హైదరాబాద్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): వైద్య విద్యకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ కాలేజీల్లో కొత్తగా 10,023 యూజీ, పీజీ వైద్య విద్య సీట్లను మంజూరు చేసింది. బుధవారం జరిగిన కేంద్రమంత్రి వర్గ సమావేశంలో ఇందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కొత్తగా మంజూరైన సీట్లలో 5,023 ఎంబీబీఎస్‌ సీట్లు, 5,000 పీజీ సీట్లు ఉన్నాయి. 2028-29 నాటికి ఈ సీట్లు అందుబాటులోకి వస్తాయని కేంద్రం వెల్లడించింది. దీనికి మొత్తం రూ.15,034.50 కోట్ల వ్యయం కానుండగా ఇందులో కేంద్రం వాటా రూ.10,303.20 కోట్లు. రాష్ట్రాల వాటా రూ.4,731.30 కోట్లు. ఒక్కో సీటుకు రూ.1.50 కోట్లు వ్యయం చేయనున్నారు. ప్రస్తుతం దేశంలోని 808 మెడికల్‌ కాలేజీల్లో 1,23,700 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక ఎంబీబీఎస్‌ సీట్లు భారత్‌లోనే ఉన్నాయని కేంద్రం పేర్కొంది. గడిచిన పదేళ్లలో కొత్తగా 69,352 యూజీ, 43,041 పీజీ సీట్లు అందుబాటులోకి వచ్చాయని తెలిపింది. అయినప్పటికీ దేశంలో డాక్టర్ల కొరత ఉన్నందున వైద్య సీట్ల పెంపు అనివార్యమైందంది. ఏటా దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థులు నీట్‌ రాస్తున్నారు. మెడికల్‌ సీట్ల సంఖ్య పరిమితంగా ఉండటంతో చాలామంది వైద్య విద్యను అభ్యసించలేని పరిస్థితి నెలకొంది. కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయంతో వైద్య విద్యలో ప్రవేశం పొందే అవకాశం విద్యార్థులకు ఎక్కువగా ఉంటుంది. తద్వారా ఎక్కువమంది వైద్యులు అందుబాటులోకి వస్తారు. అలాగే స్పెషలిస్ట్‌ డాక్టర్ల లభ్యత కూడా పెరుగుతుంది. ప్రభుత్వాస్పత్రుల్లో కొత్త స్పెషాలిటీ సేవలు ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. కాగా, కేంద్రం ప్రకటించిన కొత్త యూజీ, పీజీ సీట్లలో ఏపీకి యూసీ సీట్లే వచ్చే అవకాశం ఉందని వైద్యవర్గాలు చెప్పాయి. కొత్త సీట్లకు వచ్చే నెలలో ఎన్‌ఎంసీ దరఖాస్తులు కోరే అవకాశం ఉందని తెలిపాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 17 వైద్య కాలేజీ లు ఉండగా 250-300 సీట్ల వరకూ దరఖాస్తు చేయొచ్చని అంచనా వేస్తున్నారు.

Updated Date - Sep 25 , 2025 | 04:13 AM