Guntur: మానవత్వం చాటుకున్న కేంద్ర మంత్రి పెమ్మసాని
ABN , Publish Date - Aug 11 , 2025 | 04:39 AM
రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వృద్ధునికి కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్...
దుగ్గిరాల, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వృద్ధునికి కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, స్వయంగా కట్టుకట్టి తన కాన్వాయ్లోని ఓ కారులో ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల సీసీఎల్ ఫ్యాక్టరీలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళుతున్న పెమ్మసాని.. రేవేంద్రపాడు వద్ద రోడ్డు పక్కనే రక్తపు మడుగులో పడి ఉన్న వృద్ధుడిని గమనించారు. వెంటనే కారు నిలిపి వృద్ధుని వద్దకు వెళ్లి స్థానికుల ద్వారా వివరాలు తెలుసుకున్నారు. చినవడ్లపూడికి చెందిన వెళ్లా వెంకటేశ్వరరావు మోపెడ్పై వెళుతుండగా వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. రక్తం కారుతున్న వృద్ధునికి స్వయంగా కట్టుకట్టిన కేంద్ర సహాయ మంత్రి, తన కాన్వాయ్లోని ఓ కారులో వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు.