మొబైల్ కనెక్టివిటీ సమస్యకు పరిష్కారం: పెమ్మసాని
ABN , Publish Date - Dec 29 , 2025 | 04:14 AM
రాష్ట్రంలో మొబైల్ కనెక్టివిటీ లేని గ్రామాల సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో ముందుకు వెళుతోందని కేంద్ర గ్రామీణాభివృద్థి, కమ్యూనికేషన్ల శాఖల సహాయ...
గుంటూరు, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మొబైల్ కనెక్టివిటీ లేని గ్రామాల సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో ముందుకు వెళుతోందని కేంద్ర గ్రామీణాభివృద్థి, కమ్యూనికేషన్ల శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. గుంటూరులో ఇండస్ట్ అవర్స్ నిర్వాహకులు ఆదివారం ఆయన్ను కలిశారు. టవర్స్ ఏర్పాటు తదితర అంశాలపై ఎదురవుతున్న ఇబ్బందులను వివరించారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం 414 గ్రామాల్లో మొబైల్ కనెక్టివిటీ లేదన్న విషయం తన దృష్టికి వచ్చిందని, వాటిలో 120 గ్రామాల్లో ఒక్క మొబైల్ టవర్ కూడా లేదని గుర్తించారని చెప్పారు. ఆ గ్రామాల్లో డిజిటల్ భారత్ నిధి (డీబీఎన్) స్కీమ్ కింద రూ. 120 కోట్ల వ్యయంతో కొత్త మొబైల్ టవర్ల ఏర్పాటు పనులు చేపట్టామని, 2026 డిసెంబరు నాటికి పనులు పూర్తిచేయాలనే లక్ష్యంతో ఉన్నామని తెలిపారు. మిగిలిన 250కి పైగా గ్రామాల్లో టవర్లు ఉన్నప్పటికీ, ఒక్కటే టవర్ ఉండటం, గ్రామం మొత్తం నెట్వర్క్ కవర్ కాకపోవడం, లేదా ఒక్క కంపెనీ సేవలకే పరిమితమవడం వంటి సమస్యలు ఉన్నాయని చెప్పారు. ఆ గ్రామాల్లో కనెక్టివిటీని బలోపేతం చేసేందుకు ప్రైవేట్ టెలికాం సంస్థలు, ఇండస్ టవర్స్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు.