CBI Investigation: కేజీహెచ్కు సీబీఐ
ABN , Publish Date - Sep 26 , 2025 | 04:54 AM
పశ్చిమ బెంగాల్ విద్యార్థిని మృతిపై దర్యాప్తు నిమిత్తం ఢిల్లీ నుంచి సీబీఐ అధికారులు కింగ్జార్జి ఆస్పత్రి(కేజీహెచ్)కి వచ్చారు. సీబీఐ అధికారి దినేష్ తోపాటు మరొకరు గురువారం ఉదయం ఆస్పత్రి సూపరింటెండెంట్...
బెంగాల్ విద్యార్థిని మృతిపై విచారణ
వైద్యులను మూడు గంటలు ప్రశ్నించిన అధికారులు
విశాఖపట్నం, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): పశ్చిమ బెంగాల్ విద్యార్థిని మృతిపై దర్యాప్తు నిమిత్తం ఢిల్లీ నుంచి సీబీఐ అధికారులు కింగ్జార్జి ఆస్పత్రి(కేజీహెచ్)కి వచ్చారు. సీబీఐ అధికారి దినేష్ తోపాటు మరొకరు గురువారం ఉదయం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వాణి ఛాంబర్కు వెళ్లి...తాము వచ్చిన పనిని వివరించారు. 2023లో నరసింహనగర్లోని ‘ఆకా్ష-బైజూస్’ కళాశాలలో పశ్చిమ బెంగాల్ విద్యార్థిని(17) చేరారు. దొండపర్తిలో కళాశాల హాస్టల్లో ఉండే ఆమె ఆ ఏడాది ఆగస్టు 14న హాస్టల్ భవనం పైనుంచి కింద పడ్డారు. హాస్టల్ సిబ్బంది రామ్నగర్లోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా 17న మరణించారు. మృతదేహానికి కేజీహెచ్లో పోస్టుమార్టం నిర్వహించారు. మృతురాలి తండ్రి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఫిర్యాదు చేయడంతో అక్కడి సీఐడీ అధికారులను ఆమె విచారణకు ఆదేశించారు. తర్వాత ఈ కేసును సీబీఐకి అప్పగించారు. దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు కేజీహెచ్లో పోస్టుమార్టం నిర్వహించిన ఆరుగురు వైద్యుల బృందాన్ని విచారించేందుకు గురువారం వచ్చారు. పోస్టుమార్టం నివేదికపై సంతకాలు చేసిన న్యూరోసర్జరీ, జనరల్ మెడిసిన్, అనస్థీషియా, కార్డియాలజీ, ఫోరెన్సిక్ సైన్స్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్ విభాగాల వైద్యులను విచారించారు. ఆరు విభాగాల వైద్యులకుగానూ మూడు విభాగాల వైద్యులు మాత్రమే అందుబాటులో ఉండడంతో వారినే సుమారు మూడు గంటల పాటు ప్రశ్నించి వెళ్లిపోయారు.