Palnadu District: 50 కార్లు చోరీ చేసిన ‘పేట ముఠా’
ABN , Publish Date - Dec 21 , 2025 | 04:32 AM
పల్నాడు జిల్లా చిలకలూరిపేట జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే.
నంబర్లు మార్చి పలువురికి విక్రయం
కొన్నవారిలో రాజకీయ నేతలు కూడా
నేరాలకు సహకరించిన పోలీసులకు కానుకలుగా అవే దొంగ వాహనాలు
ఇప్పటికి15 వాహనాలు స్వాధీనం
నరసరావుపేట, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): పల్నాడు జిల్లా చిలకలూరిపేట జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో కార్ల దొంగల ముఠా గుట్టురట్టయింది. కార్లు అపహరించి విక్రయించడంతోపాటు.. తమ నేరాలకు సహకరించిన పోలీసులకు కొన్ని కార్లను గిఫ్టుగా కూడా ఇచ్చారు. ఈ వ్యవహారా న్ని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు ఆయా కార్ల ను ఎవరెవరికి విక్రయించారు? కానుకలుగా తీసుకున్న అధికారులు ఎవరు? అనే విషయాలపై దృష్టిపెట్టారు. ము ఠా సభ్యులు ఏఎ్సఐ కొడుకు మదమంచి వెంకట అనుజ్ఞ నాయుడు, పుల్లంశెట్టి మహేశ్, బెల్లంకొండ గోపి, షేక్ నబీ బాషా, నాలి వెంకటరావులను అరెస్టు చేశారు. అనంతరం వీరిని కస్టడీకి తీసుకున్నారు. అదేవిధంగా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ వేర్వేరుగా విచారించి.. వివరాలు రాబడుతున్నారు. మొత్తం 50 కార్లను దొంగిలించినట్టు గుర్తించారు. వీటిలో ఇప్పటికి 15 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నెంబర్లు మార్చి..
సుమారు 50 కార్ల వరకు చోరీ చేసిన ముఠా వాటి నెంబర్ ప్లేట్లు.. చాసిస్ నెంబర్లు మార్చి విక్రయించినట్టు విచారణలో అంగీకరించారు. మరోవైపు కేసు విచారణ ఊపందుకోవడంతో ఒకరిద్దరు పోలీసు అధికారులు ముఠా నుంచి తీసుకున్న కార్లను తిరిగి ఇచ్చినట్టు సమాచారం. అదేవిధంగా కొందరు రాజకీయ నేతలు కొనుగోలు చేసిన కార్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న కార్లను నరసరావుపేట రూరల్ పోలీ సు స్టేషన్కు తరలించారు. కొన్ని కార్లకు నెంబర్లు లేకపోవడం, మరికొన్నిటికి రిజిస్ట్రేషన్లు కూడా జరగలేదని తెలిసింది. కొన్ని కార్లకు తెలంగాణకు చెందిన నెంబరు పేట్లు ఉన్నాయి. కార్ల చాసిస్ నెంబర్లు సేకరించి రవాణశాఖ పరిశీలనకు పంపారు. ఈ క్రమంలో కొన్ని కార్లకు నకిలీ నెంబర్లు ఉన్నట్టు గుర్తించారు. వీటిలో ఇన్నోవా, కియా, పార్చ్యునర్ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. కొన్ని కార్లకు తాత్కాలిక నెంబర్లు ఉన్నాయి. మరోవైపు, ఈ కేసులో ముఠా నాయకుడు మదమంచి వెంకట అనుజ్ఞ నాయుడు తండ్రి ఏఎ్సఐ శ్రీనివాసరావు, ముఠాకు సహరించిన చిలకలూరిపేట ఎస్ఐ రహంతుల్లాలను సస్పెండ్ చేశారు.