AP BJP State President Madhav: వైసీపీ అవినీతిని సహించేది లేదు
ABN , Publish Date - Aug 09 , 2025 | 04:50 AM
వైసీపీ అవినీతిని సహించేది లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. గత వైపీసీ పాలనలో జరిగిన అక్రమాలపై దర్యాప్తులో రాజీ పడేది లేదని,అక్రమార్కులకు శిక్షలు తప్పవని హెచ్చరించారు.
అక్రమార్కులకు శిక్షలు తప్పవు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్
న్యూఢిల్లీ, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): వైసీపీ అవినీతిని సహించేది లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. గత వైపీసీ పాలనలో జరిగిన అక్రమాలపై దర్యాప్తులో రాజీ పడేది లేదని,అక్రమార్కులకు శిక్షలు తప్పవని హెచ్చరించారు. శుక్రవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని ఆయన కలిశారు. రాష్ట్ర రాజకీయాలు,బీజేపీ చేపడుతున్న కార్యక్రమాలను ప్రధానికి వివరించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.‘బీజేపీని ఇంటింటికీ తీసుకెళ్లాలని, పార్టీ చేపడుతున్న కార్యక్రమాలను వివరించాలని,ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలపై అవగాహన కల్పించాలని ప్రధాని మోదీ సూచించారు. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి పార్టీని బలోపేతం చేయాలన్నారు.తెలుగు భాషను ప్రమోట్ చేయాలని, యువతకు పార్టీని చేరువ చేయాలని సూచించారు.అలాగే...ట్రంప్ టారి్ఫల గురించి ఏపీ రైతాంగం ఆందోళనలో ఉందని ప్రధానికి వివరించా.అమెరికా సుంకాలను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ దేశాలకు ఎగుమతులపై దృష్టి సారించాలని కోరాను.ఆత్మనిర్భర్ భారత్పై దృష్టి పెట్టాలని,పొగాకు కాకుండా ప్రత్యామ్నాయ పంటలు పండించాలని ప్రధాని సూచించారు.తొమ్మిది జిల్లాల్లో నా పర్యటన పూర్తయింది.ఈ నెల 10 నుంచి మూడోదశ జిల్లాల పర్యటన ప్రారంభమవుతుంది.30న సంచార జాతుల కోసం స్ఫూర్తి కార్యక్రమం నిర్వహిస్తున్నాం.వారికి డీఎన్టీ సర్టిఫికెట్ ఇచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నాం.ఈ విషయాలన్నీ ప్రధానికి వివరించాను’అని తెలిపారు.
వైసీపీ బెదిరింపులను ఉపేక్షించవద్దు:ఏపీ మద్యం కుంభకోణం కేసు ఢిల్లీ లిక్కర్ స్కాం కంటే పెద్దదని మాధవ్ ఆరోపించారు.ఏపీ మద్యం కేసులో అరెస్టులను బీజేపీ స్వాగతిస్తోందని, భవిష్యత్తులో మళ్లీ కుంభకోణాలు పునరావృతం కాకూడదంటే..ఈ కేసులో శిక్షలు కఠినంగా ఉండాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అక్రమార్కులకు ఎప్పుడూ అండగా నిలవదని చెప్పారు.ప్రభుత్వ అధికారులపై ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదన్నారు. నాలుగేళ్ల తర్వాత అధికారంలోకి తామే వస్తామని,అప్పుడు అధికారుల వ్యవహారం చూస్తామని అంటూ వైసీపీ బెదిరింపులకు పాల్పడడం ముమ్మాటికీ స్వేచ్ఛను హరించడమేనని తెలిపారు.అటువంటి బెదిరింపులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదన్నారు. అమరావతిలో ప్రభుత్వ,ప్రైవేటు సంస్థలకు విధాన పరంగానే భూముల కేటాయింపు జరుగుతోందని తెలిపారు.