MLA Balakrishna: బసవతారకం ఆస్పత్రి విస్తరణకు సహకరించండి
ABN , Publish Date - Aug 01 , 2025 | 05:33 AM
కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎ్సఆర్) నిధుల ద్వారా బసవతారకం ఆస్పత్రిని విస్తరించేందుకు మద్దతు అందించాలని పలువురు కేంద్ర మంత్రులకు ప్రముఖ సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విజ్ఞప్తి చేశారు.
కేంద్ర మంత్రులకు నందమూరి బాలకృష్ణ విన్నపం
న్యూఢిల్లీ, జూలై 31 (ఆంధ్రజ్యోతి): కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎ్సఆర్) నిధుల ద్వారా బసవతారకం ఆస్పత్రిని విస్తరించేందుకు మద్దతు అందించాలని పలువురు కేంద్ర మంత్రులకు ప్రముఖ సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విజ్ఞప్తి చేశారు. గురువారం పార్లమెంటులో టీడీపీ ఎంపీలతో కలిసి ఆయన కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, మనోహర్లాల్ ఖట్టర్, హర్దీప్సింగ్ పూరి, మన్సుఖ్ మాండవీయతో వేర్వేరుగా భేటీ అయ్యారు. హిందూపురంలో ఈఎ్సఐ ఆస్పత్రిని స్థాపించాలని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రికి విన్నవించారు. హిందూపురం రింగ్ రోడ్ నిర్మాణాన్ని చేపట్టాలంటూ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. కాగా, అంతకుముందు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పార్టీ ఎంపీలతో కలిసి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో బాలకృష్ణ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు అందిస్తున్న సేవల గురించి తెలియజేశారు. బాలకృష్ణ వెంట టీడీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రసాదరావు, కలిశెట్టి, తెన్నేటి కృష్ణప్రసాద్, జీఎం హరీశ్, బీకే పార్థసారథి, అంబికా లక్ష్మీనారాయణ, శ్రీభరత్, కేశినేని చిన్ని ఉన్నారు. పార్లమెంటు ప్రాంగణంలో కలిశెట్టి అప్పలనాయుడుకు చెందిన సైకిల్ ఎక్కి బాలకృష్ణ సందడి చేశారు. సరదాగా ఆ సైకిల్పై కూర్చుని, ఫొటోలు దిగారు.