AP Govt Advisor Anka Rao: 2న ఐదు కోట్ల మొక్కలకు అంకురార్పణ
ABN , Publish Date - Jul 31 , 2025 | 06:35 AM
ఐదు కోట్ల మొక్కలు పెంచేందుకు ఆగస్టు 2వ తేదీన శ్రీకారం చుడుతున్నామని ప్రభుత్వ పర్యావరణ సలహాదారు కొమెర అంకారావు తెలిపారు.
పర్యావరణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అంకారావు
పిడుగురాళ్ల, జూలై 30 (ఆంధ్రజ్యోతి): ఐదు కోట్ల మొక్కలు పెంచేందుకు ఆగస్టు 2వ తేదీన శ్రీకారం చుడుతున్నామని ప్రభుత్వ పర్యావరణ సలహాదారు కొమెర అంకారావు తెలిపారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జానపాడు జడ్పీ పాఠశాలలో బుధవారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ....‘ఆగస్టు 2న నల్లమల ఫారెస్టులో 15 కిలోమీటర్లు వాక్ రన్ చేయనున్నాం. కారంపూడి మండలం సింగరుట్ల నల్లమల ఫారెస్టు నుంచి గుత్తికొండ బిళం వరకు నడక కొనసాగిస్తూ...అడవిలో ప్లాస్టిక్ బాటిళ్లు, వ్యర్ధపదార్థాలు తొలగింపుతో పాటు అటవీ ప్రాంతంలో మొక్కలు పెంచేందుకు విత్తన బాల్స్ను చల్లనున్నాం. జిల్లాలోని పర్యావరణ ప్రేమికులు, పాఠశాల విద్యార్థులు 15 కిలోమీటర్ల వాక్ రన్లో పాల్గొనవచ్చు. ప్రతి వారం ఓ మండలంలోని జడ్పీ పాఠశాలను సందర్శించి పర్యావరణ పెంపుపై అవగాహన కల్పించడంతో పాటు మనకు అందుబాటులో ఉన్న మొక్కల విశిష్టత, వివరాలను విద్యార్థులకు తెలియజేసేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నాం.’ అని వివరించారు. మనచుట్టూ ఆరోగ్యానికి మేలు చేసే మొక్కలు ఎన్నో ఉన్నాయని, అవి ఏమిటో, ఎందుకు ఉపయోగిస్తారు అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించే ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్టు అంకారావు తెలిపారు.