అనాథ బాలికపై దాష్టీకం
ABN , Publish Date - Jun 02 , 2025 | 01:38 AM
తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులకు ఆశ్రయం కల్పించాల్సిన మచిలీపట్నంలోని బాలసదన్ అనేక విమర్శలను ఎదుర్కొంటోంది. వేసవి సెలవుల్లో ఇంటికి వెళ్లలేదని ఓ అనాథ బాలికపై బాలసదన్ సూపరింటెండెంట్ శనివారం ఇనుప స్కేలుతో తీవ్రంగా కొట్టింది. బాలిక బిగ్గరగా ఏడవటంతో సమీపంలోని ఐసీడీఎస్ కార్యాలయం సిబ్బంది, అక్కడకు పనిపై వచ్చిన వారు బలసదన్కు పరిగెత్తుకొచ్చారు. తల్లిదండ్రులు లేని చిన్నారి ఎక్కడకు వెళ్తుందని సూపరింటెండెంట్ను నిలదీశారు. వారితో వాగ్వాదానికి దిగిన సూపరింటెండెంట్ మీ సెల్ఫోన్లలో ఈ ఘటనపై తీసిన వీడియోలు, ఫొటోలు తొలగించాలని డిమాండ్ చేసింది. దీనిపై స్థానికులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విషయం ఆలస్యంగా వెలుగుచూసింది.
- వేసవి సెలవులకు వెళ్లలేదని ఇనుప స్కేలుతో కొట్టిన బాలసదన్ సూపరింటెండెంట్
- సూపరింటెండెంట్ నిర్వాకంపై పలువురి ఆగ్రహం
- తల్లిదండ్రులు లేని చిన్నారి ఎక్కడకు వెళ్తుందని నిలదీత
- ఏడుస్తున్న చిన్నారి వద్దకు వచ్చిన వారితో సూపరింటెండెంట్ వాగ్వివాదం
- సెల్ఫోన్ల నుంచి వీడియోలు తొలగించాలని డిమాండ్
- ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి..
తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులకు ఆశ్రయం కల్పించాల్సిన మచిలీపట్నంలోని బాలసదన్ అనేక విమర్శలను ఎదుర్కొంటోంది. వేసవి సెలవుల్లో ఇంటికి వెళ్లలేదని ఓ అనాథ బాలికపై బాలసదన్ సూపరింటెండెంట్ శనివారం ఇనుప స్కేలుతో తీవ్రంగా కొట్టింది. బాలిక బిగ్గరగా ఏడవటంతో సమీపంలోని ఐసీడీఎస్ కార్యాలయం సిబ్బంది, అక్కడకు పనిపై వచ్చిన వారు బలసదన్కు పరిగెత్తుకొచ్చారు. తల్లిదండ్రులు లేని చిన్నారి ఎక్కడకు వెళ్తుందని సూపరింటెండెంట్ను నిలదీశారు. వారితో వాగ్వాదానికి దిగిన సూపరింటెండెంట్ మీ సెల్ఫోన్లలో ఈ ఘటనపై తీసిన వీడియోలు, ఫొటోలు తొలగించాలని డిమాండ్ చేసింది. దీనిపై స్థానికులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విషయం ఆలస్యంగా వెలుగుచూసింది.
ఆంధ్రజ్యోతి- మచిలీపట్నం :
బంటుమిల్లికి చెందిన పామర్తి దుర్గ తల్లిదండ్రులు చనిపోవడంతో మచిలీపట్నంలోని బాలసదన్లో ఉంటోంది. బాలసదన్కు సమీపంలో ఉన్న రాంజీ పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. తల్లిదండ్రుల పేర్లు కూడా ఈ చిన్నారి చెప్పలేనిస్థితి. బాలసదన్లో 20 మంది వరకు పిల్లలు ఉంటారు. పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వడంతో ఇక్కడ ఉండే పిల్లలు వారి బంధువుల ఇళ్లకు వెళ్లారు. పామర్తి దుర్గకు నా అనే వారు ఎవరూ లేకపోవడంతో బాలసదన్లోనే ఉండిపోయింది. సెలవుల్లోనూ దుర్గ ఇక్కడే ఉండిపోయిందనే కారణంతో తరచూ ఆ చిన్నారిపై అక్కడ పనిచేసే సూపరింటెండెంట్ చికాకును ప్రదర్శిస్తోందని చుట్టుపక్కల గృహాలవారు, ఐసీడీఎస్ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది చెబుతున్నారు. శనివారం మధ్యాహ్నం సమయంలో బాలసదన్ నుంచి బాలిక ఏడుపు పెద్దగా వినిపించడంతో ఐసీడీఎస్ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది, కార్యాలయంలో పనిమీద వచ్చినవారు అక్కడకు పరిగెత్తారు. బాలిక గదిలో ఉండి బిగ్గరగా ఏడుస్తుండటంతో ఏం జరిగిందని అక్కడ పనిచేసే సూపరింటెండెంట్ను అడిగారు. మా కార్యాలయంలోకి మీరెందుకు వచ్చారంటూ ఆమె ఐసీడీఎస్ కార్యాలయ సిబ్బందితో పాటు అక్కడకు వచ్చిన వారితో వాగ్వివాదానికి దిగింది. బాలికను ఇనుప స్కేలు అంచుతో కొట్టిందని గ్రహించిన వారు వీడియో తీశారు. ఆ సమయంలో ఐసీడీఎస్ కార్యాలయంలో పనిచేసే ఒక మహిళా ఉద్యోగి బాలసదన్లో బాలికపై దాడి చేసిన సూపరింటెండెంట్కు మద్దతుగా నిలిచి వీడియోలు తీయకుండా అడ్డుపడింది. అనాథ బాలికపై దాడి ఘటనను చూసిన అక్కడున్నవారు తాము తీసిన వీడియోను పైఅధికారులకు పంపారు. అధికారులు స్పందించి ఈ విషయంపై వివరాలు అందజేయాలని కోరడంతో ఐసీడీఎస్ నోడల్ అధికారి బాలసదన్కు వెళ్లి జరిగిన విషయంపై ఆరా తీశారు.
ఐసీడీఎస్ కార్యాలయానికి వచ్చి హంగామా..
బాలికను కొట్టిన ఘటనపై అధికారులు ఆరా తీయడంతో బాలసదన్లో పనిచేసే సూపరింటెండెంట్ తన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా ఐసీడీఎస్ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది వద్దకు వచ్చి వారితో వాగ్వివాదానికి దిగింది. వీడియోలు ఎవరు తీశారో చెప్పాలని, వాటిని తొలగించాలని, మీ ఫోన్లు లాక్ తీసి చూపాలని సిబ్బందిపై ఒత్తిడి తెచ్చింది. మేము వీడియోలు తీయలేదని, కార్యాలయానికి పనిపై వచ్చిన వారు వీడియోలు తీశారని సిబ్బంది చెప్పారు. అయినా వారి ఫోన్లను బాలసదన్లో పనిచేసే సూపరింటెండెంట్ పరిశీలించింది. బాలసదన్, ఇక్కడున్న వన్స్టాప్ సెంటర్ నా పరిధిలో ఉన్నాయని, నన్ను ఎవరూ ఏం చేయలేరని, బాలసదన్ సూపరింటెండెంట్ అనడంతో చిన్నారి పెద్దగా ఏడుస్తుండటంతోనే బాలిక ఇబ్బంది ఏమిటో చూడటానికి వచ్చామని, ఇందులో తప్పేముందని, ఐసీడీఎస్ కార్యాలయ సిబ్బంది ప్రశ్నించారు. అనాథ బాలిక వేసవి సెలవుల్లో ఎక్కడకు వెళుతుందని, ఇంతగా చిన్నారిని కొట్టాల్సి అవసరం ఏం వచ్చిందని, ఉన్న ఒక్క పాపపై దాడి చేస్తే ఎలాగని వారు నిలదీశారు. కాగా, నన్ను సూపరింటెండెంట్ కొట్టారని, అల్లరి చేస్తున్నానని, యోగా చేయలేదనే కారణంతో కొట్టారని చిన్నారి దుర్గ అమాయకంగా చెప్పడం గమనార్హం.
విచారణ చేస్తున్నాం
బాలసదన్లో శనివారం జరిగిన ఘటన నా దృష్టికి వచ్చింది. ఏం జరిందనే విషయం తెలుసుకునేందుకు నోడల్ అధికారిని అక్కడకు పంపాం. చిన్నారి దుర్గ కొంత అల్లరి చేస్తుంది. బాలసదన్లో పనిచేసే సూపరింటెండెంట్ దూకుడు స్వభావంతో వ్యవహరిస్తుంది. దీంతోనే ఈ ఘటన జరిగినట్లుగా తేలింది. తల్లిదండ్రులు లేకపోవడంతోనే పామర్తి దుర్గ బాలసదన్లో ఉండి పోయింది. ఉన్న ఒక్క చిన్నారిని అక్కడ పనిచేసే సూపరింటెండెంట్ జాగ్రత్తగా చూసుకోవాల్సిందే.
-రాణి, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్