Araku Coffee: అన్ని నియోజకవర్గాలో అరకు కాఫీ షాపులు
ABN , Publish Date - Sep 10 , 2025 | 06:20 AM
రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లోనూ అరకు కాఫీ షాపుల ఏర్పాటుతోపాటు, గిరిజన ఉత్పత్తులు..
అధికారులకు మంత్రి సంధ్యారాణి ఆదేశాలు
విశాఖపట్నం, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లోనూ అరకు కాఫీ షాపుల ఏర్పాటుతోపాటు, గిరిజన ఉత్పత్తులు ప్రజలకు అందుబాటులోకి తేవాలని గిరిజన సహకార సంస్థ(జీసీసీ) అధికారులను రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆదేశించారు. విశాఖపట్నంలోని జీసీసీ ప్రధాన కార్యాలయంలో చైర్మన్ కె.శ్రావణ్కుమార్, ఎండీ, వీసీ కల్పనకుమారితో కలిసి ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. గిరిజనులకు లాభదాయకమైన కాఫీ సాగును మరింత పెంచాలన్నారు. చింతపల్లి ప్రాంతంలో కాఫీ తోటలకు వ్యాపించిన బెర్రీ బోరర్ తెగులుపై బెంగ పడవద్దని, ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి తెలిపారు.
ఏజెన్సీ ప్రాంతాలకు కేటాయించిన రూ.7,500 కోట్లలో రూ.1,300 కోట్లను రహదారుల నిర్మాణానికి ఉపయోగించామన్నారు. అరకు కాఫీ మార్కెటింగ్కు సంబంధించి ఇప్పటికే 18 సంస్థలతో ఎంఓయూలు చేసుకున్నామని వెల్లడించారు.