Minister Somanna Statement: ఏడాదిలోనే ఏపీకి రూ.9500 కోట్ల రైల్వే ప్రాజెక్టులు
ABN , Publish Date - Dec 28 , 2025 | 05:31 AM
ప్రధా ని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఏపీలో అభివృద్ధి పరుగులు పెడుతోందని రైల్వేశాఖ సహాయ మంత్రి సోమన్న అన్నారు.
రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న
హిందూపురంలో వందే భారత్ స్టాపింగ్ ప్రారంభోత్సవం
మోదీ.. బాబు నాయకత్వంలో అభివృద్ధి పరుగులు
హిందూపురం, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): ప్రధా ని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఏపీలో అభివృద్ధి పరుగులు పెడుతోందని రైల్వేశాఖ సహాయ మంత్రి సోమన్న అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం, సోమందేపల్లిలో ఆయన శనివారం పర్యటించారు. సోమందేపల్లి మండలం చాకర్లపల్లి వద్ద రూ.4 కోట్లతో అభివృద్ధి చేసిన రైల్వే స్టేషన్ను ప్రారంభించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం హిందూపురం చేరుకుని, ఎంపీ బీకే పార్థసారథితో కలిసి యశ్వంత్పురం నుంచి హైదరాబాద్కు వెళ్లే వందేభారత్ రైలు స్టాపింగ్ను మంత్రి సోమన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘2024-25 ఆర్థిక సంవత్సరంలో ఏపీలో రూ.9,470 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం అనుమతిచ్చింది. రాష్ట్రంలో ఎనిమిది వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. తాలూకా స్థాయిలో వందేభారత్ రైలును ఆపడం హిందూపురంలోనే మొదటిసారి. ఇది హిందూపురం ప్రజలకు మోదీ ఇచ్చిన గిఫ్ట్’ అని అన్నారు. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా 1560 కి.మీ. కొత్త రైల్వే మార్గాల నిర్మాణం జరుగుతోందని మంత్రి తెలిపారు. 717 ఆర్ఓవీలు, ఆర్యూవీల నిర్మాణం పూర్తయిందన్నారు. అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ధి పథకం కింద రాష్ట్రంలో 73 రైల్వేస్టేషన్లలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఇందులో తిరుపతి, నెల్లూరు, విశాఖపట్నం, హిందూపురం, ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఏపీ రాజధాని అమరావతికి రైల్వేశాఖ మరిన్ని నిధులు కేటాయించిందని మంత్రి తెలిపారు.