AP State Water Resources Department: ముగ్గురా.. ఐదుగురా
ABN , Publish Date - Aug 17 , 2025 | 05:50 AM
పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకంపై తెలంగాణ నుంచి ఎదురవుతున్న అడ్డంకులను తొలగించేందుకు కేంద్ర జలశక్తి మం త్రిత్వశాఖ నియమించే కమిటీకి ఎంతమంది సభ్యులను...
పోలవరం-బనకచర్ల కమిటీ సభ్యులపై రాష్ట్ర జలవనరుల శాఖ తర్జనభర్జన
పేర్లు ప్రతిపాదించాలంటూ కేంద్రం లేఖ
సీఎంతో చర్చించాక ఖరారుకు నిర్ణయం
అమరావతి, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకంపై తెలంగాణ నుంచి ఎదురవుతున్న అడ్డంకులను తొలగించేందుకు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ నియమించే కమిటీకి ఎంతమంది సభ్యులను ప్రతిపాదించాలనే దానిపై రాష్ట్ర జలవనరుల శాఖ తర్జనభర్జన పడుతోంది. ముగ్గురు సభ్యులతో సరిపుచ్చాలా.. లేదంటే ఐదుగురి పేర్లను పంపాలా అనే సంశయంలో పడింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఈ ఏడాది జూలై 16న సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి బృందంతో పోలవరం-బనకచర్లకు గోదావరి వరద జలాలను వాడుకోవడంపై చర్చ జరిగింది. ఈ చర్చలో 2 రాష్ట్రాలూ తమ వాదనలకు కట్టుబడి ఉండటంతో.. కేంద్రం, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో కూడిన కమిటీని వేయాలని పాటిల్ నిర్ణయించారు. ఈ సమావేశం ముగిసిన వెంటనే రాష్ట్ర జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధా న కార్యదర్శి జి.సాయిప్రసాద్, జల వనరుల శాఖ సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, జల వనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ నరసింహమూర్తి పేర్లను కేంద్రానికి ప్రతిపాదించాలని నిర్ణయించారు. కమిటీకి సభ్యుల పేర్లతో ప్రతిపాదనలు పంపాలంటూ ఈనెల 12న రాష్ట్ర జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి కేంద్ర జలశక్తి శాఖ సంయుక్త కార్యదర్శి ప్రదీప్ కుమార్ అగర్వాల్ లేఖ రాశారు. ఈ లేఖపై శనివారర స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయిప్రసాద్ ప్రాథమిక సమీక్ష నిర్వహించారు. ముందుగా అనుకున్నట్లు ముగ్గురి పేర్లను కేంద్రానికి పంపాలా లేదంటే.. ఐదుగురి పేర్లను ప్రతిపాదించాలా అనే సంశయం తలెత్తింది. దీంతో ముఖ్యమంత్రితో సోమవారం చర్చించాలని నిర్ణయించారు.