Police Appeal to High Court:పెద్దారెడ్డి విషయంలో..సింగిల్ జడ్జి ఉత్తర్వులపై పోలీసుల అప్పీల్
ABN , Publish Date - Aug 19 , 2025 | 06:11 AM
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన ఇంటికి వెళ్లి నివాసం ఉండేందుకు తగిన భద్రత కల్పించాలని ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను...
నేడు విచారణకు హైకోర్టు ధర్మాసనం అంగీకారం
అమరావతి, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన ఇంటికి వెళ్లి నివాసం ఉండేందుకు తగిన భద్రత కల్పించాలని ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను పోలీసులు హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీల్ చేశారు. సోమవారం కోర్టు విచారణ ప్రారంభమైన వెంటనే ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎ్సజీపీ) ఎస్.ప్రణతి స్పందిస్తూ.. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషన్ వేశామని.. మంగళవారం విచారణ జరపాలని అభ్యర్థించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఇందుకు అంగీకరించింది. తాడిపత్రిలోని తన ఇంటికి వెళ్లేందుకు భద్రత కల్పించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ పోలీసులు అమలు చేయడం లేదని పేర్కొంటూ పెద్దారెడ్డి హైకోర్టులో కోర్టుధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. పెద్దారెడ్డి సోమవారం (18న) తాడిపత్రిలోని ఆయన ఇంటికి వెళ్లి నివాసం ఉండేందుకు భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించారు. ఉదయం 10 నుండి 11 గంటల మధ్య తాడిపత్రి వెళ్లేందుకు పెద్దారెడ్డికి అనుమతి ఇచ్చారు. కాన్వాయ్లో 5 వాహనాలకు మించి ఉండకూడదని.. అనుచరులను రెచ్చగొట్టడానికి వీల్లేదని.. ఇంటివద్ద ఏ సమయంలో కూడా 50-60 మందికి మించి ఉండడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అధికార పార్టీ నేత, పిటిషనర్ మధ్య ఘర్షణ వాతారణాన్ని నిరోధించేందుకు అదనపు బలగాలను ఏర్పాటు చేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. వీటిని పోలీసులు సవాల్ చేశారు.