AP Ministers: పదోన్నతుల రిజర్వేషన్లపై మరింత అధ్యయనం
ABN , Publish Date - Jul 19 , 2025 | 05:55 AM
ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల పదోన్నతుల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్పై మంత్రుల కమిటీ శుక్రవారం సచివాలయంలో సమావేశమైంది. మంత్రులు డోలా బాలవీరాంజనేయస్వామి, గుమ్మిడి సంధ్యారాణి, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్, పలువురు ఉన్నతాధికారులు సమావేశమై చర్చించారు.
మార్కెట్ ధరలపైనా మంత్రుల కమిటీ సమీక్ష
అమరావతి, జూలై 18(ఆంధ్రజ్యోతి): ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల పదోన్నతుల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్పై మంత్రుల కమిటీ శుక్రవారం సచివాలయంలో సమావేశమైంది. మంత్రులు డోలా బాలవీరాంజనేయస్వామి, గుమ్మిడి సంధ్యారాణి, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్, పలువురు ఉన్నతాధికారులు సమావేశమై చర్చించారు. ఇతర రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల పదోన్నతుల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు తీరు, పలు కేసుల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్పై న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులపైనా సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ అంశంపై మరోసారి సమావేశం కావాలని మంత్రుల కమిటీ నిర్ణయించింది. ఈ అంశంపై మరింత అధ్యయనం చేసి ఎవరికీ ఇబ్బందులు లేకుండా నిర్ణయం తీసుకుంటామని మంత్రుల కమిటీ తెలిపింది.
ఆహార నాణ్యతపై అవగాహన, తనిఖీలు
విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర నగరాల్లో ఆహార నాణ్యతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు తరచూ తనిఖీలు నిర్వహించాలని తూనికలు, కొలతలశాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులను మంత్రుల ఉపసంఘం ఆదేశించింది. శుక్రవారం సాయంత్రం సచివాలయంలో పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగిన మంత్రుల ఉపసంఘం మార్కెట్ ధరలపై సమీక్షించింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయశాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వరిపై మార్కెట్ రుసుము 2 శాతం నుంచి ఒక శాతానికి తగ్గించే ప్రతిపాదనపై చర్చించారు. ద్రవ్యోల్బణం నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. సన్నరకం ధాన్యం సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రజలకు తక్కువ ధరలకే నాణ్యమైన నిత్యావసర సరుకులు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి నాదెండ్ల చెప్పారు. టమాటా ఉత్పత్తిని బట్టి ధరల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
దివ్యాంగులకు 21 రకాల పత్రాలు: మంత్రి డోలా
దివ్యాంగులకు చట్ట ప్రకారం 21 రకాల వైకల్య ధ్రువీకరణ (డిజేబిలిటీ సర్టిఫికెట్) పత్రాల జారీకి చర్యలు తీసుకోవాలని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో దివ్యాంగ, సీనియర్ సిటిజన్ అఽధికారులు, గ్రామ, వార్డ్ సచివాలయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. దివ్యాంగులకు ఆధార్ కార్డులు, సదరం సర్టిఫికెట్లు, పెన్షన్లపై సమీక్ష చేశారు. ఇతర ప్రాంతాల్లో చదువుతున్న దివ్యాంగ విద్యార్థులందరికీ డీబీటీ విధానంలో పెన్షన్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. 70 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ పీఎం అజయ్ వయోవందన పథకం కింద రూ.5 లక్షల ఉచిత వైద్యం అందించనున్నట్లు మంత్రి స్వామి తెలిపారు.