Investment Politics: కారం.. భారం..!
ABN , Publish Date - Oct 19 , 2025 | 03:03 AM
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఐటీ శాఖ మంత్రుల మధ్య ‘ఎక్స్’ వేదికగా వార్ కొనసాగుతోంది. విశాఖపట్నంలో గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటుకు ఒప్పందం....
లోకేశ్ వర్సెస్ ప్రియాంక్ ఖర్గే.. ‘ఎక్స్’లో ఐటీ మంత్రుల వార్
బెంగళూరు, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఐటీ శాఖ మంత్రుల మధ్య ‘ఎక్స్’ వేదికగా వార్ కొనసాగుతోంది. విశాఖపట్నంలో గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటుకు ఒప్పందం కుదిరిన తర్వాత ఇది మొదలైంది. ‘ఆంధ్ర ఆహారం అంటే కారం అంటారు. ఆహారమే కాదు మా పెట్టుబడులు కూడా కారంగానే ఉంటాయి. మా పొరుగువారిలో కొందరికి అప్పుడే మంట పుట్టింది’ అని ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ గురువారం ఎక్స్లో పోస్టు పెట్టారు. దీనికి కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే స్పందిస్తూ రీ పోస్టు చేశారు. ‘ఆహారంలో కొంత కారాన్ని అందరూ ఇష్టపడతారు. కానీ పౌష్టికాహార నిపుణులు సమతుల్యమైన ఆహారాన్ని సూచిస్తారు. అర్థశాస్త్ర నిపుణులు సమతుల్యమైన బడ్జెట్ను సిఫారసు చేస్తారు. మా పొరుగు రాష్ట్రంవారికి భారం రూ.10 లక్షల కోట్లు దాటింది. ఆర్థిక లోటు (ఆదాయం కొరత) దయనీయస్థితిలో ఉంది. అది భారమే’ అని ప్రియాంక్ ఖర్గే శుక్రవారం పోస్టు పెట్టారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ ఏడాది రూ.1.16 లక్షల కోట్ల రుణం తీసుకుందని ప్రస్తావించారు.