AP High Court: అతనికి బెయిల్ ఇవ్వలేం
ABN , Publish Date - Jul 20 , 2025 | 05:34 AM
తాను పనిచేస్తున్న ఆసుపత్రి యజమాని భార్యను హత్య చేసి, అనంతరం ఆమె మృతదేహంతో లైంగిక వాంఛ తీర్చుకున్న వ్యక్తికి బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.
యజమాని భార్యను హత్య చేసి..శవంతో వాంఛ తీర్చుకున్న వ్యక్తి
బెయిల్ నిరాకరించిన హైకోర్టు
మృగంలా వ్యవహారించాడని వ్యాఖ్య
బెయిల్ ఇస్తే సమాజంపై ప్రతికూల
ప్రభావం పడుతుందన్న న్యాయస్థానం
అమరావతి, జూలై 19(ఆంధ్రజ్యోతి): తాను పనిచేస్తున్న ఆసుపత్రి యజమాని భార్యను హత్య చేసి, అనంతరం ఆమె మృతదేహంతో లైంగిక వాంఛ తీర్చుకున్న వ్యక్తికి బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇలాంటి కేసులో బెయిల్ మంజూరు చేస్తే సమాజంపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొంది. యజమాని భార్యపై లైంగిక వ్యామోహంతో నిందితుడు మృగంలా వ్యవహరించాడని, ఆమె ప్రతిఘటించడంతో విషయం బయట పడుతుందని దారుణంగా హత్య చేశాడని కోర్టు తెలిపింది. అనంతరం, మృతదేహంతో కామవాంఛ తీర్చుకున్నాడని పేర్కొంది. దీనికి ప్రాధమిక ఆధారాలు ఉన్నాయని, వాస్తవాలను ట్రయల్ కోర్టు తేలుస్తుందని తెలిపింది. చాలాకాలం నుంచి జైలులో ఉన్నాడనే కారణంతో ఇలాంటి తీవ్రమైన కేసులో బెయిల్ పొందేందుకు పిటిషనర్ అనర్హుడని తేల్చి చెప్పింది. నేరానికి పాల్పడిన విధానం, నేర తీవ్రత, సమాజంపై చూపించే ప్రభావం, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి. మల్లికార్జునరావు ఇటీవల ఉత్తర్వులు ఇచ్చారు. నెల్లూరు జిల్లా కావలిలో ఓ వైద్యుడు 15 ఏళ్లుగా ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. పశ్చిమబెంగాల్కు చెందిన నిందితుడు నయన్ బిస్వాస్ ఈ ఆసుపత్రిలో కాంపౌండర్గా చేరారు.
యజమాని కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్న అతను 2024, డిసెంబరు 31 తెల్లవారు జామున యజమాని భార్యపై లైంగిక వాంఛ తీర్చుకునేందుకు ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో తలపై బలంగా కొట్టి హత్య చేశాడు. మృతదేహాన్ని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. మృతురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కావలి వన్టౌన్ పోలీసులు నయన్ బిస్వా్సపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు పూర్తి చేసి ప్రాథమిక చార్జిషీట్ దాఖలు చేశారు. కారాగారంలో ఉన్న నిందితుడు బిస్వాస్ పోలీసులు చార్జ్షీట్ దాఖలు చేసినందున బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు.