MLC Resignation: జయమంగళ పిటిషన్పై హైకోర్టులో విచారణ
ABN , Publish Date - Sep 03 , 2025 | 05:12 AM
ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తూ తాను సమర్పించిన లేఖపై తగిన ఉత్తర్వులు జారీచేసేలా శాసన మండలి చైర్మన్ను ఆదేశించాలని కోరుతూ జయ మంగళ వెంకటరమణ దాఖలు చేసిన పిటిషన్పై...
అమరావతి, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తూ తాను సమర్పించిన లేఖపై తగిన ఉత్తర్వులు జారీచేసేలా శాసన మండలి చైర్మన్ను ఆదేశించాలని కోరుతూ జయ మంగళ వెంకటరమణ దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ ప్రారంభమైన వెంటనే చైర్మన్ తరఫున వకాల్తా వేశానని, పూర్తి వివరాలతో కౌంటర్ వేసేందుకు సమయం ఇవ్వాలని ఆయన న్యాయవాది అభ్యర్థించారు. జయ మంగళ తరఫున న్యాయవాది ఎన్.అశ్వినీకుమార్ స్పందిస్తూ... గత విచారణలో మండలి చైర్మన్, కార్యదర్శి తరఫున స్టాండింగ్ కౌన్సిల్ హాజరయ్యారని, రాజీనామా విషయంలో రాతపూర్వక వివరాలు సమర్పించాలని కోర్టు ఆదేశించిందన్నారు. పిటిషనర్ రాజీనామా లేఖను పరిగణనలోకి తీసుకొని తగిన ఉత్తర్వులు జారీ చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ అనుబంధ పిటిషన్ వేశామన్నారు. దీనిపై విచారణ జరపాలని కోరారు. ఇరువైపుల వాదనలు పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ కౌంటర్ దాఖలు చేసిన తర్వాత వ్యాజ్యంపై తుది విచారణ జరిపి నిర్ణయం వెల్లడిస్తామన్నారు. విచారణను వారం రోజులకు వాయిదా వేశారు. వైసీపీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన జయ మంగళ వెంకటరమణ గతేడాది నవంబరు 23న సమర్పించిన రాజీనామా లేఖపై తగిన ఉత్తర్వులిచ్చేలా చైర్మన్ను ఆదేశించాలని కోరారు.