Vamsi Bail Plea Adjourned: ప్రాసిక్యూషన్కు పూర్తి అఫిడవిట్ ప్రతి అందించండి
ABN , Publish Date - Apr 11 , 2025 | 06:23 AM
వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టు విచారణ వాయిదా వేసింది. పూర్తి అఫిడవిట్ కాపీని ప్రాసిక్యూషన్కు అందించాలని సూచించింది

వంశీ బెయిల్ పిటిషన్పై హైకోర్టు సూచన
అమరావతి, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): వైసీపీనేత వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ గురువారం హైకోర్టులో విచారణకు వచ్చింది. ప్రాసిక్యూషన్ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్పందిస్తూ.. తమకు అందించిన ముందస్తు బెయిల్ పిటిషన్ కాపీలలో కొన్ని పేజీలు మిస్ అయ్యాయని తెలిపారు. దీంతో న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు విచారణను ఈనెల 16కు వాయిదా వేశారు. పూర్తి వివరాలున్న అఫిడవిట్ కాపీని ప్రాసిక్యూషన్కు అందజేయాలని సూచించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి వ్యవహారంలో సత్యవర్ధన్ ఫిర్యాదు ఆధారంగా పలువురిని నిందితులుగా చేరుస్తూ 2023 ఫిబ్రవరి 22న గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. వంశీకి బెయిల్ ఇచ్చేందుకు ట్రయల్ కోర్టు నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న గొంతెన రాజ్కుమార్కు ఎస్సీఎస్టీ చట్టం కింద పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు వర్తించవని ఎస్సీఎస్టీ కేసులను విచారించే విజయవాడ ప్రత్యేక కోర్టు న్యాయాధికారి ప్రస్తావించడాన్ని సవాల్ చేస్తూ సీఐడీ వేసిన క్రిమినల్ రివిజన్ పిటిషన్ను కూడా వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్తో జత చేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు.