Fee Hike for Lorries: ఫిట్నెస్ ఫీజుల పెంపునకు బ్రేక్
ABN , Publish Date - Dec 24 , 2025 | 04:56 AM
రవాణా వాహనాలకు ఫిట్నెస్ మంజూరు, రెన్యూవల్ ఫీజుల పెంపు నిర్ణయానికి తాత్కాలికంగా ప్రభుత్వం బ్రేకులు వేసింది....
లారీ ఓనర్లకు ఊరట.. కేంద్రం స్పష్టత ఇచ్చాకే నిర్ణయం
అమరావతి, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): రవాణా వాహనాలకు ఫిట్నెస్ మంజూరు, రెన్యూవల్ ఫీజుల పెంపు నిర్ణయానికి తాత్కాలికంగా ప్రభుత్వం బ్రేకులు వేసింది. కేంద్ర ప్రభుత్వం నవంబరు 11న రవాణా వాహనాల వయసు ఆధారంగా ఫిట్నెస్ ఫీజులు పెంచుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. పదిహేనేళ్లు పైబడిన లారీకి ఏకంగా రూ.36 వేలు పెరగడంతో లారీ యజమానుల నుంచి నిరసన వ్యక్తమైంది. లారీలు ఆపేస్తామని అసోసియేషన్ ప్రకటించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే చర్చలు జరిపింది. ప్రభుత్వ హామీ మేరకు లారీ యజమానులు వాహనాలు ఆపకుండా నడపడంతో తాజాగా రాష్ట్ర రవాణా శాఖ పెంపు నిర్ణయాన్ని తాత్కాలికంగా పక్కన బెడుతూ ఉత్తర్వులిచ్చింది. కేంద్రం నుంచి పూర్తి స్థాయి స్పష్టత రావడంతో పాటు పొరుగు రాష్ట్రాల్లో నిర్ణయాలపై సమీక్షించి సముచిత నిర్ణయం తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయం పట్ల లారీ యజమానుల సంఘం కార్యదర్శి వైవీ ఈశ్వరరావు ఓ ప్రకటనలో హర్షం ప్రకటించారు.