NRI Interaction: ప్రవాసులతో మమేకమై..
ABN , Publish Date - Oct 27 , 2025 | 04:58 AM
దుబాయ్ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు గత శుక్రవారం యూఏఈ సహా గల్ఫ్ దేశాల్లో స్థిరపడిన ప్రవాసాంధ్రులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించారు.
దుబాయ్లో చంద్రబాబు ప్రసంగం
ప్రతి ఒక్కరికీ ఆప్యాయంగా పలకరింపు
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)
దుబాయ్ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు గత శుక్రవారం యూఏఈ సహా గల్ఫ్ దేశాల్లో స్థిరపడిన ప్రవాసాంధ్రులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించారు. గత స్మృతులను గుర్తు చేసుకుని మరీ కొందరిని పలకరించడంతో వారంతా సంతోషంతో ముగ్ధులయ్యారు. ఇక, ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు గంటల పాటు నిలబడి ఏకధాటిగా ప్రసంగించిన తీరుకు ప్రవాసాంధ్రులు.. ముఖ్యంగా యువకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 75 ఏళ్ల వయసులో కూడా ఎలాంటి అలుపు లేకుండా పాతికేళ్ల యువనేతగా చంద్రబాబు వ్యవహరించిన తీరును ప్రవాసులు కొనియాడారు. గత మూడు దశాబ్దాలుగా సీఎం దుబాయ్కు వస్తున్నా తొలిసారి రాజకీయాలకు అతీతంగా తెలుగువారిని ఉద్దేశించి ప్రసంగించారు. ఇది వేలాది మందిని ఆకట్టుకుంది. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో 9 ఏళ్ల వేమూరి హాంశ్ నుంచి కాకినాడలో పుట్టి దుబాయ్లో స్థిరపడ్డ 92 ఏళ్ల ఫాతీమా బీ వరకు ఉన్నారు. ఫాతిమా బీ మాట్లాడుతూ.. ‘‘మా ఆంధ్రప్రదేశ్ను దుబాయ్ తరహాలో అభివృద్థి చేయాలి.’’ అని సీఎంకు సూచించారు. సీఎం తన ప్రసంగం అనంతరం వేదిక నుంచి దిగి వెళ్తూ వీల్ చైర్లో ఉన్న ఫాతీమా వద్దకు వెళ్లి ఆశ్వీర్వాదం తీసుకున్నారు. సౌదీ అరేబియా నుంచి వచ్చి తనను కలిసిన గడ్డం శిల్ప, చెన్నుపాటి అక్షితలతో సీఎం మాట్లాడుతూ.. గతంలో వారు తనను విజయవాడలో కలిసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి సౌదీ అరేబియా, కువైత్, బహ్రెయిన్, ఖతర్, ఒమన్ దేశాల నుంచి కూడా తరలివచ్చారు. కాగా, సీఎం ప్రసంగం వినేందుకు భారీ సంఖ్యలో ప్రవాసులు తరలి వచ్చారని భారత కాన్సల్ జనరల్ సతీశ్ కుమార్ శివన్ తెలిపారు.
పెట్టుబడుల ఆకర్షణలో బాబు సామర్థ్యం మరోసారి రుజువైంది!
గూగుల్ డేటా హబ్ పై నీతి ఆయోగ్ మాజీ సీఈవో
అమరావతి, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): ప్రతిష్ఠాత్మక గూగుల్ సంస్థ విశాఖపట్నంలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో డేటా హబ్ను ఏర్పాటు చేస్తుండడంపై నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ హర్షం వ్యక్తం చేశారు. విశాఖలో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా హబ్ను ఏర్పాటు చేసేలా గూగుల్ను ఒప్పించడం ద్వారా పెట్టుబడుల ఆకర్షణ లో తన ప్రతిభా సామర్థ్యాలను సీఎం చంద్రబాబు మరోసారి చాటుకున్నారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఎక్స్లో పోస్టు చేశారు. దీనిపై చంద్రబాబు స్పంది స్తూ.. గూగుల్ రాక తన ఒక్కడి ప్రతిభే కాదని రాష్ట్ర ప్రజలందరిదీ అని పేర్కొన్నారు. అంతులేని అవకాశాలను అందిపుచ్చుకోవడంలో గూగుల్ రావడం తొలి అడుగు మాత్రమేనని, మరిన్ని ఉత్తేజభరిత సమయాలు ముందున్నాయని పేర్కొన్నారు.