AP Cabinet Decision: కొత్తగా రూ.20 వేల కోట్ల పెట్టుబడులు
ABN , Publish Date - Dec 12 , 2025 | 04:55 AM
రాష్ట్రంలో ఇంకో రూ.20,267 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
పెట్టుబడి ప్రతిపాదనలకు క్యాబినెట్ ఓకే
లక్ష మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి
క్వాంటమ్, ఐటీ, ఎలకా్ట్రనిక్స్ రంగాల్లో మరో రూ.1,421 కోట్ల పెట్టుబడి
బీసీలకు రూఫ్టాప్ సోలార్కు 20 వేల అదనపు సబ్సిడీ
163 కోట్లతో లోక్భవన్ నిర్మాణం
ఎల్-1కు అప్పగింతకు అంగీకారం
డీఏ ఉత్తర్వులకు ఆమోదముద్ర
క్రికెటర్ శ్రీచరణికి 2.5 కోట్ల నగదు
వెయ్యి గజాల స్థలం, గ్రూప్1 ఉద్యోగం
4 పర్యాటక హోటళ్లకు పచ్చజెండా
మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించిన మంత్రి పార్థసారథి
అమరావతి, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇంకో రూ.20,267 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. వీటిలో రూ.15 వేల కోట్ల పెట్టుబడులతో 14 ప్రాజెక్టుల స్థాపనకు ఆమోదముద్ర వేసింది. వీటి ద్వారా లక్షకుపైగా ఉద్యోగాలు లభించే అవకాశముంది. అలాగే క్వాంటమ్ కంప్యూటింగ్, ఐటీ, ఎలకా్ట్రనిక్స్ రంగాల్లో మరో రూ.1,421 కోట్ల పెట్టుబడులకు ఆమోదముద్ర వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం అమరావతి సచివాలయంలో క్యాబినెట్ సమావేశమైంది. మొత్తం 44 అంశాలకు ఆమోదం తెలిపినట్లు రాష్ట్ర సమాచార-పౌరసంబంధాలు, గృహనిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్థసారథి విలేకరులకు వెల్లడించారు. ఇటీవల ఉద్యోగులు, పింఛనుదారులకు మంజూరు చేసిన డీఏ ఉత్తర్వులకు ఆమోదముద్ర వేసినట్లు చెప్పారు. నెలకు 200 యూనిట్ల వరకు గృహ విద్యుత్ వినియోగం కలిగిన 27.2 లక్షల మంది వెనుకబడిన వర్గాల వినియోగదారులకు (బీసీలకు) 2 కిలోవాట్ వరకు సామర్థ్యం గల రూఫ్టాప్ సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు కోసం.. కేంద్రం అందించే రూ.60 వేల రాయుతీతోపాటు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మరో రూ.20,000 సబ్సిడీ మంజూరు చేసే ప్రతిపాదనను క్యాబినెట్ ఆమోదించిందని తెలిపారు. ఈ పథకానికి సుమారు రూ.5,445.7 కోట్ల అంచనా వ్యయంగా నిర్ణయించారు. రూ.163 కోట్లతో అమరావతిలో గవర్నర్ నివాసం, అసెంబ్లీ దర్బార్ హాల్, గవర్నర్ కార్యాలయం, రెండు అతిథిగృహాలు, సిబ్బంది క్వార్టర్లతో కూడిన లోక్భవన్ నిర్మాణానికి ఎల్-1 బిడ్ ఆమోదించేందుకు సీఆర్డీఏ కమిషనర్కు అధికారమిచ్చే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
కీలక నిర్ణయాలివీ..
ఐసీసీ మహిళల ప్రపంచ క్రికెట్ కప్లో ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహించిన శ్రీచరణికి రూ.2.5 కోట్ల నగదు, కడపలో వెయ్యి చ.గజాల స్థలం, గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చే ప్రతిపాదనకు ఆమోదం.
సౌరశక్తి, కెమికల్, ఫార్మాసూటికల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, బయోఫ్యూయెల్స్, గ్లాస్ తయారీ, మహిళా ఎంఎస్ఎంఈ పార్కులు, మల్టీ-ప్రొడక్ట్ పారిశ్రామిక పార్క్ లాంటి రంగాల్లో 15 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. వీటిలో రూ.870 కోట్లతో ఇఫ్కో కిసాన్ సెజ్ లిమిటెడ్.. ఏపీఐ, డ్రగ్ ఇంటర్మీడియట్స్ తయారీ యూనిట్ ఏర్పాటుకు విరూపాక్ష ఆర్గానిక్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.1,225 కోట్ల పెట్టుబడికి ఆమోదం. టీజీవీ స్రాక్ లిమిటెడ్-రూ.1,216 కోట్లు.. రెన్యూ ఫొటో వాలియక్స్ ప్రైవేట్ లిమిటెడ్-రూ.3,990 కోట్లు.. శ్రీవేంకటేశ్వర బయోటెక్-122 కోట్లు, ఎమర్జ్ గ్లాస్ ఇండస్ర్టీస్ -రూ.182 కోట్లు.. జైట్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్-305.9 కోట్లు.. రామన్ సింగ్స్ గ్లోబల్ ఫుడ్ పార్క్-రూ.141 కోట్లు.. గాయత్రి రెన్యుబుల్ ఫ్యూయల్స్-రూ.320 కోట్లు, మల్లాది డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్-రూ.343 కోట్లు.. ఎలీప్ ఉమోన్ ఎంఎ్సఎంఈ పార్క్-రూ.22.48 కోట్లు..మాస్ ఫ్యాబ్రిక్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్-రూ.200 కోట్లు..టెలియన్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్-రూ.350 కోట్లు. ఈ పెట్టుబడులతో లక్షకుపైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
క్వాంటమ్ కంప్యూటింగ్, ఎలక్ర్టానిక్స్ తయారీ, ఐటీ రంగాల్లో 11 కీలక ప్రాజెక్టులకు ఆమోదం. రూ.1,421.2 కోట్ల పెట్టుబడితో, 3,057 ప్రత్యక్ష ఉద్యోగాల కల్పనకు అవకాశం. అమరావతిలో 7 క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రాజెక్టులు, నాయుడుపేటలో ఒక ఎలక్ర్టానిక్స్ తయారీ ప్రాజెక్టు, విశాఖలో 3 ఐటీ క్యాంపస్ ప్రాజెక్టుల ఏర్పాటు.
అమృత్-2లో భాగంగా రూ.9,514.63 కోట్ల వ్యయంతో 506 పెండింగ్ ప్రాజెక్టులు చేపట్టేందుకు ఆమోదం.
చిత్తూరు జిల్లా కుప్పంలో పాలార్ నదిపై చెక్-డ్యామ్ మరమ్మతులు, పునర్నిర్మాణ పనులకు రూ.15.96 కోట్లు.
గిరిజన ప్రాంతాల్లో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న 227 మంది తెలుగు పండితులు, 91 మంది హిందీ పండితులు, 99 మంది వ్యాయామ ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి.
సాంఘిక సంక్షేమ శాఖ నియంత్రణలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు పునర్నిర్మాణానికి ఆమోదం.
కేంద్ర హోంశాఖ రూపొందించిన ‘మోడల్ ప్రిజన్స్ చ ట్టం-2023’ అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ యాక్టు-2025 ముసాయిదా బిల్లుకు, దానిని అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు ఆమోదం.
నెల్లూరు జిల్లా తెట్టు రైల్వే ేస్టషన్ సమీపంలో మల్టీ-మోడల్ రైల్ కార్గో టెర్మినల్ స్థాపనకు చేవూరు గ్రామంలోని 153.77 ఎకరాల భూమిని ఢిల్లీకి చెందిన మెస్సర్స్ రామాయపట్నం కార్గో రిసెప్షన్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్కు కేటాయింపు.
నెల్లూరు జిల్లా బోగోలులోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో 29.58 ఎకరాలు ఎంబైఎస్ సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ సంస్థకు కేటాయింపు.
విశాఖ, బాపట్ల, తిరుపతిల్లో రూ.784.39 కోట్ల పెట్టుబడులతో నాలుగు ప్రముఖ హాస్పిటాలిటీ ప్రాజెక్టులకు భూమి కేటాయింపు, ప్రోత్సాహకాలకు ఆమోదం. విశాఖలోని ఎండాడలో పీవీఆర్ హాస్పటాలిటీస్కు లీజుకు 3 ఎకరాలు.. రూ.225 కోట్ల పెట్టుబడి.. మధురవాడలో మెగ్లాన్ లీజర్ అండ్ ఎంటర్టైన్మెంట్కు లీజుకు ఐదెకరాలు.. రూ.348 కోట్ల పెట్టుబడి.. బాపట్లలో యాగంటీ ఎస్టేట్స్ వారి సొంత భూమిలో రూ.61 కోట్లతో బీచ్ రెస్టారెంట్ల ఏర్పాటుకు ఆమోదం. తిరుపతిలో నందినీ హోటల్స్ 149 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుకు అనుమతి.
ఎంబైఎస్ ముంతాజ్ హోటల్స్ లిమిటెడ్ పేరు స్వర హోటల్స్ లిమిటెడ్గా మార్పు. రూ.250 కోట్లతో తిరుపతిలో ఒబెరాయ్ విలాస్ లగ్జరీ రిసార్ట్ నిర్మాణానికి ప్రత్యామ్నాయ భూమి కేటాయింపునకు ఆమోదం.
కడప జిల్లా కొప్పోలు, చెమ్మలూరు, టీ కోడూరు గ్రామాల్లో 45 ఎకరాల ప్రభుత్వ భూమి లీజు ప్రాతిపదికన విండ్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఎన్ఆర్ఈడీసీఏపీ, హెటిరో విండ్ పవర్కు అనుకూలంగా బదిలీ చేసే ప్రతిపాదనకు ఆమోదం.