AP Bar Council: న్యాయవాదుల సంక్షేమంపై ఏపీ బార్ కౌన్సిల్ కీలక నిర్ణయాలు
ABN , Publish Date - Sep 29 , 2025 | 04:09 AM
రాష్ట్రంలోని న్యాయవాదుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఏపీ బార్ కౌన్సిల్ పలు కీలక నిర్ణయాలు తీసుకొంది. బార్ కౌన్సిల్ చైౖర్మన్ నల్లారి ద్వారకానాథ్రెడ్డి...
మరణానంతర ప్రయోజనం 9లక్షలకు పెంపు
అమరావతి, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని న్యాయవాదుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఏపీ బార్ కౌన్సిల్ పలు కీలక నిర్ణయాలు తీసుకొంది. బార్ కౌన్సిల్ చైౖర్మన్ నల్లారి ద్వారకానాథ్రెడ్డి అధ్యక్షతన శనివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో వీటిని వెల్లడించారు. ఇప్పటివరకు న్యాయవాది మరణిస్తే కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం రూ.6లక్షలు ఇస్తుండగా, దీనిని రూ.9లక్షలకు (ఇందులో రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్ రూ.4లక్షలు)పెంచారు. న్యాయవాదులు, వారి జీవిత భాగస్వాములకు వైద్య సహాయం కింద రూ.1.5లక్షలు ఇస్తుండగా, రూ. 2.5లక్షలకు పెంచారు. మరోవైపు ఈనెల 26న జరిగిన సంక్షేమ కమిటీ సమావేశంలో మరణించిన న్యాయవాదుల కుటుంబ సభ్యులకు రూ.2.86 కోట్లను చెల్లించారు. అనారోగ్యంతో బాధపడుతున్న 85మంది న్యాయవాదులకు రూ.74.20 లక్షల ఆర్థిక సహాయం అందించారు. ముగ్గురు న్యాయవాదులకు పదవీ విరమణ ప్రయోజనాలు రూ.9లక్షలు అందజేశారు. న్యాయవాదుల క్లర్కుల సంక్షేమ కమిటీ సమావేశంలోనూ పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటివరకు రూ.4లక్షలుగా ఉన్న మరణాంతర ప్రయోజనాన్ని రూ.4.50లక్షలకు పెంచారు. వైద్య సహాయం నిమిత్తం ఇస్తున్న రూ.80వేలను రూ.లక్షకు పెంచారు. అక్టోబరు 1 నుంచి ఈ నిర్ణయాలు అమలులోకి వస్తాయని చైర్మన్ ద్వారకానాథ్రెడ్డి తెలిపారు. దేశంలోని ఏ బార్ కౌన్సిల్లోనూ ఇంత పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం చేయడంలేదన్నారు.