Revenue Energy CEO: ఏపీ అప్రోచ్ చాలా బాగుంది
ABN , Publish Date - Nov 14 , 2025 | 05:21 AM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవ, ప్రాజెక్టులపై చూపించే ఆసక్తి తమను ఎంతో ఆశ్చర్యానికి గురిచేశాయని రెన్యూ ఎనర్జీ చైర్మన్ అండ్ సీఈవో సుమంత్ సిన్హా సంతోషం వ్యక్తం చేశారు.
రెన్యూ ఎనర్జీ చైర్మన్, సీఈవో సుమంత్ సిన్హా
విశాఖపట్నం/అమరావతి, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవ, ప్రాజెక్టులపై చూపించే ఆసక్తి తమను ఎంతో ఆశ్చర్యానికి గురిచేశాయని రెన్యూ ఎనర్జీ చైర్మన్ అండ్ సీఈవో సుమంత్ సిన్హా సంతోషం వ్యక్తం చేశారు. అందుకే వెనక్కి వెళ్లిపోయిన తాము తిరిగి ఏపీకి పెట్టుబడులు పెట్టేందుకు వచ్చామని వెల్లడించారు. విశాఖలోని నోవాటెల్ హోటల్లో సుమంత్ సిన్హా విలేకరులతో మాట్లాడారు. తాము ఏపీలో పెట్టుబడులు పెట్టాలనే ఆసక్తితో గతంలో ముందుకువస్తే అప్పటి ప్రభుత్వం నుంచి తగిన సహకారం లభించలేదన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత మరోసారి సంప్రదిస్తే చంద్రబాబు, లోకేశ్ నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని చెప్పారు. వారు అత్యంత వేగంగా స్పందించి, ఆయా ప్రాజెక్టులు అతి తక్కువ కాలంలో సాకారమయ్యేలా పూర్తి సహకారం అందించారని, ఇందుకోసం ప్రత్యేక అధికారులను తమకు కేటాయించారని వివరించారు. వారి చొరవ వల్లే తాము ఈ రోజు అదనంగా రూ.60 వేల కోట్లకు ఎంవోయూ చేశామన్నారు. కాగా, అమెరికాకు చెందిన కార్బోనాటిక్ ఎల్ఎల్సీ సంస్థ రాష్ట్రంలో రూ.31,500 కోట్ల పెట్టుబడులకు చంద్రబాబు సమక్షంలో ఎంవోయూ చేసుకుంది. ఈ సందర్భంగా ఆ సంస్థ అధ్యక్షుడు ట్రెండన్ టి.ఫిట్జ్పాట్రిక్ మాట్లాడుతూ తాము పెట్టుబడులకు ప్రతిపాదనలు పంపగానే సీఎం అత్యంత వేగంగా స్పందించారని, ఒక అధికారిని పంపించి సంప్రదింపులు చేశారని, అక్కడి నుంచి అన్నీ చాలా వేగంగా ముందుకు కదిలాయని వివరించారు.